Share News

రేవంత్‌ నీకు దమ్ము ధైర్యం ఉంటే.. కిషన్‌రెడ్డి సవాల్

ABN , Publish Date - Apr 28 , 2024 | 06:42 PM

అసెంబ్లీ ఎన్నికల వేళ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయి.. లేకుంటే గద్దె దిగిపో.. తప్పయిపోయిందని లెంప లేసుకోవాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.

రేవంత్‌ నీకు దమ్ము ధైర్యం ఉంటే..  కిషన్‌రెడ్డి సవాల్

హైదరాబాద్, ఏప్రిల్ 27: అసెంబ్లీ ఎన్నికల వేళ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయి.. లేకుంటే గద్దె దిగిపో.. తప్పయిపోయిందని లెంప లేసుకోవాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. మీరు ఇలాంటి అబద్దాలు చెబితే ఊరుకునేదే లేదన్నారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసే ఉద్దేశ్యం కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు.


ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా.. బీజేపీ మాత్రం డబుల్ డిజిట్ స్థానాల్లో గెలవడం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు. పార్టీ లేని చోట కూడా తమ గ్రాఫ్ బాగా పెరిగిందని.. ఇది తెలిసే కాంగ్రెస్ పార్టీ అబద్దపు ప్రచారానికి తెర తీసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎజెండాలో తాము పడదలుచుకోలేదన్నారు. ప్రజా సంఘాల నేతలను తాము అరెస్ట్ చేయలేదని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పేగులు మెడలో వేసుకుంటాడని చెప్పారు. కండ్లను తీసి బాల్ ఆడుకుంటారన్నారు. రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యాననే భావనే లేదని... ఆయన ఏదైనా మాట్లాడగలడని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


రాహుల్ గాంధీ ఎక్కడ జోడో యాత్ర చేస్తే.. అక్కడ కాంగ్రెస్‌కు ఎంతో మంది నాయకులు రాజీనామా చేసి వెళ్లిపోయారని వ్యంగ్యంగా అన్నారు. ప్రధాని మోదీని విమర్శించేందుకు ఏ విధమైన అంశాలు కాంగ్రెస్ పార్టీకి దొరకడం లేదని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో కాంగ్రెస్, బీజేపీతో పోలిస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ఎంతటి తప్పుడు ఆరోపణలు చేసినా.. ప్రజలు మాత్రం వాటిని విశ్వసించడం లేదన్నారు. బీజేపీపై ఒక్కరు కూడా అవినీతి ఆరోపణ చేయలేదంటే.. మోదీ పాలన ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. ఏ రంగంలో అయినా.. మోదీ పాలనను తప్పు పట్టే అవకాశం లేకుండా అభివృద్ధి చేశారని వివరించారు.


రేవంత్‌కు కల వచ్చిందో.. రాహుల్‌కు కల వచ్చిందో.. మా ఎజెండాను వారే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మీరు చేస్తున్న తప్పుడు ప్రచారానికి సంబంధించి ఒక్క సాక్షాన్ని అయినా చూపించాలని రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను నీరు గార్చింది, మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తూ బీసీలకు విద్య, వైద్యాన్ని అందకుండా చేస్తోంది కాంగ్రెస్ పార్టీనేని తెలిపారు.


కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందనే భయంలో కాంగ్రెస్ కల్లిబొల్లి మాటలు చెబుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో అమిత్ షా చేసిన ఉపన్యాసాన్ని కాంగ్రెస్ మార్ఫింగ్ చేసిందని ఆరోపించారు. ఆ పార్టీ పరిస్థితి ఎంత దిగజారిందో దీని ద్వారా అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తొండి ఆట ఆడుతోందన్నారు. అన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని సీఎం రేవంత్ అంటున్నారు. కానీ రాష్ట్రంలో బీసీలకు మాత్రం అన్యాయమే జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


వారికి సైతం రిజర్వేషన్లు అందాలంటే అది బీజేపీ వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్‌కు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పలేడన్నారు. అలాగే తమ ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా చెప్పలేని స్థితిలో ఆయన ఉన్నాడని చెప్పారు. ఇక రాహుల్ సమర్థ నాయకుడని కూడా చెప్పలేని పరిస్థితి రేవంత్ రెడ్డిదన్నారు. అదే విధంగా సోనియాగాంధీ ఇటలీలో కాదు.. భారత్‌లో పుట్టిందని కూడా చెప్పలేడన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పి కూడా ఓట్లడగ లేని పరిస్థితిలో రేవంత్ ఉన్నాడన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఎక్కడా స్పందనలేదన్నారు.


ఆ పార్టీపై అందరూ నిరాశ, నిస్పృహలో ఉన్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తొందరపడి ఆ పార్టీకి ఓటు వేశామా? అని ప్రజలు ఆలోచన సైతం చేస్తున్నారన్నారు. బీజేపీ అంటే.. ఒక వ్యక్తి కోసమో.. ఒక కుటుంబం కోసమే పని చేసే పార్టీ కాదని స్పష్టం చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను మార్ఫింగ్ చేయడంపై కేసు పెట్టాం, ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. ఇది ఆషామాహీ కేసు కాదన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్.. రిజర్వేషన్లు సమర్థవంతంగా అమలు జరగాలన్నారు. అలాగే అన్ని వర్గాలకు న్యాయం జరగాలని ఆయన ఆకాంక్షించారని చెప్పారు. దీన్ని పటిష్టంగా అమలుచేయాలన్నదే మోహన్ భగవత్ సంకల్పమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read National News and Telugu News

Updated Date - Apr 28 , 2024 | 06:42 PM