Share News

Hyderabad: డబ్బుకు ఏసీపీ దాసోహం.. రూ. కోట్ల ఆస్తుల వ్యవహారంలో సెటిల్‌మెంట్‌

ABN , Publish Date - Sep 14 , 2024 | 09:50 AM

డబ్బుంటే చాలు.. తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయొచ్చు అనడానికి, డబ్బుకు కొంతమంది పోలీసులు దాసోహం అంటారు అనడానికి ఈ ఏసీపీ(ACP) ఉదంతం ఓ ఉదాహరణ. నిబంధనలకు విరుద్ధంగా సివిల్‌ తగాదాలో తలదూర్చడమే కాదు.. నిందితులతో బేరం కుదుర్చుకుని, ఎస్‌హెచ్‌వో(SHO)ను కాదని మరీ బాధితులపై అక్రమ కేసులు నమోదు చేశాడు.

Hyderabad: డబ్బుకు ఏసీపీ దాసోహం.. రూ. కోట్ల ఆస్తుల వ్యవహారంలో సెటిల్‌మెంట్‌

- రూ. 50 లక్షలకు డీల్‌

- అసలు విషయం దాచిపెట్టి.. డీసీపీని తప్పుదోవ పట్టించిన ఘనుడు

- సెంట్రల్‌ జోన్‌లో వెలుగులోకి ఓ ఏసీపీ లీలలు

- విచారణకు ఆదేశించిన పోలీస్‌ ఉన్నతాధికారులు

హైదరాబాద్‌ సిటీ: డబ్బుంటే చాలు.. తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయొచ్చు అనడానికి, డబ్బుకు కొంతమంది పోలీసులు దాసోహం అంటారు అనడానికి ఈ ఏసీపీ(ACP) ఉదంతం ఓ ఉదాహరణ. నిబంధనలకు విరుద్ధంగా సివిల్‌ తగాదాలో తలదూర్చడమే కాదు.. నిందితులతో బేరం కుదుర్చుకుని, ఎస్‌హెచ్‌వో(SHO)ను కాదని మరీ బాధితులపై అక్రమ కేసులు నమోదు చేశాడు. నలుగురిని అకారణంగా జైలుకు పంపాడు. అసలు విషయం బయటకు రాకుండా కవర్‌ చేయడానికి ఏకంగా ఐపీఎస్‌ అధికారినే (డీసీపీ) తప్పుదోవ పట్టించాడు. చివరకు ఆయన సెటిల్‌మెంట్‌ వ్యవహారం బట్టబయలు కావడంతో పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విషయం పోలీస్‌ ఉన్నతాధికారులకు చేరడంతో సీపీ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.

ఇదికూడా చదవండి: Cyber Crime: కంబోడియాలో ఉద్యోగం పేరుతో సైబర్‌ నేరాల ఉచ్చులోకి


వివరాల్లోకి వెళ్తే..

సెంట్రల్‌ జోన్‌లోని ఒక ఠాణా పరిధిలో ప్రముఖ చర్చి ఉంది. ఆ చర్చి సొసైటీకి సంబంధించి కొంతకాలంగా రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఆ చర్చి అధీనంలో కోట్లాది రూపాయల నగదు, బ్యాంకు బ్యాలెన్స్‌లతో పాటు.. వందలకోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులను కొట్టేయాలనే పన్నాగంతో కొంతమంది వ్యక్తులు సొసైటీలో చీలిక తెచ్చి కుట్ర చేశారు. వారు ఒక ట్రస్టుగా ఏర్పడ్డారు. ఎవరైతే ట్రస్టు పేరుతో కుట్రలకు తెరతీశారో ఆ వర్గం వారికి స్థానిక ఏసీపీ కొమ్ముకాశాడు.


రూ. 50 లక్షలకు డీల్‌ కుదుర్చుకొని..

ఏసీపీని ఆశ్రయించిన ఓ వర్గం.. చర్చికి ఉన్న ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు అన్నీ వివరించి, సొసైటీలో ఆధికారాలు తమకు ఇప్పించాలని, అందుకు సంబంధించిన తాళాలు ఇప్పించి, ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెడితే.. రూ. 50 లక్షలు ఇస్తామని డీల్‌ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా రూ. 30 లక్షలు చెల్లించినట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన ఏసీపీ నెలరోజుల క్రితం ట్రస్టు సభ్యులు చర్చిలోకి వెళ్లేలా ప్లాన్‌ చేశారు. అక్కడ ఏసీపీ ఊహించినట్లుగానే సొసైటీ సభ్యులకు, ట్రస్టు సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ఏసీపీ చర్చిలోకి వెళ్లారు. ట్రస్టు సభ్యులకు వత్తాసు పలుకుతూ మాట్లాడారు.


అందుకు సొసైటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చర్చి సొసైటీకి సంబంధించిన విషయం అని, పోలీసులు జోక్యం చేసుకోవడం తగదని చెప్పారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో ట్రస్టు సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. దాంతో ఆగ్రహించిన ఏసీపీ సొసైటీకి చెందిన నలుగురు సభ్యులపై 109, 127,118,49,61 బీఎన్‌ఎ్‌స సెక్షన్‌ల కింద అక్రమ కేసులు పెట్టించాడు. స్థానిక ఇన్‌స్పెక్టర్‌కు విషయం తెలపకుండా వారిని జైలుకు పంపాడు. అంతేకాకుండా గ్యాస్‌కట్టర్‌, హేమర్స్‌తో చర్చి సొసైటీకి కార్యాలయానికి సంబంధించిన తాళాలు పగలగొట్టి మరీ దాన్ని వారికి పొజిషన్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం అప్పట్లోనే చర్చనీయాంశం కాగా, సెంట్రల్‌ జోన్‌ డీసీపీకి సదరు ఏసీపీ తప్పుడు సమాచారం ఇచ్చి, ఆ చర్చి ట్రస్టుకు సంబంధించినదే అని, సొసైటీ వారు చేస్తున్నది తప్పుడు ఆరోపణలు అని డీసీపీని తప్పుదోవ పట్టించినట్లు తెలిసింది.


కుట్ర వెనుక మాజీ ఎమ్మెల్సీ..

చర్చిలో జరిగిన కుట్ర, ఏసీపీ జోక్యం వెనుక ఒక మాజీ ఎమ్మెల్సీ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తున్నది. ఏసీపీ అక్రమ డీల్‌ విషయం శుక్రవారం వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ట్రస్టు ఏర్పాటు, దాని ముసుగులో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, నగదు కొల్లగొట్టాలనే కుట్రలో మాజీ ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్లు చర్చ జరుగుతోంది. విషయం సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 14 , 2024 | 10:58 AM