Share News

Hyderabad : రేపు రైతుల ఖాతాల్లోకి రూ.6,800 కోట్లు!

ABN , Publish Date - Jul 17 , 2024 | 04:58 AM

రుణమాఫీకి అర్హులు కాని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మేయర్లు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, సివిల్‌ సర్వీసె్‌సలో ఉన్నవారు, గ్రూప్‌-1, 2, 3 ఉద్యోగులు 19 వేల మంది దాకా ఉన్నట్లు గుర్తించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

Hyderabad : రేపు రైతుల ఖాతాల్లోకి రూ.6,800 కోట్లు!

  • 11.5 లక్షల మంది ఖాతాల్లో జమ

  • 4వ తరగతి చిరుద్యోగులు, రూ.10 వేలలోపు పింఛన్‌దారులకు కూడా రుణమాఫీ: మంత్రి తుమ్మల

  • పింఛన్‌దారులకు కూడా రుణమాఫీ

  • ఆపై ఉద్యోగులకు, ఐటీ రిటర్న్స్‌ వేసేవారికి రాదు

  • అలా అర్హులు కానివారు 19 వేల మంది

  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడి

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీకి అర్హులు కాని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మేయర్లు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, సివిల్‌ సర్వీసె్‌సలో ఉన్నవారు, గ్రూప్‌-1, 2, 3 ఉద్యోగులు 19 వేల మంది దాకా ఉన్నట్లు గుర్తించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గ్రూప్‌- 4 ఉద్యోగులు, నెలకు రూ.10 వేల లోపు పెన్షన్లు పొందేవారికి మాత్రం రుణమాఫీ పథకాన్ని వర్తింపజేస్తామని వివరించారు.

సెక్రటేరియట్‌లో మంగళవారం ఆయన రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావుతో కలిసి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రుణమాఫీ పథకం తొలివిడతలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 11.5 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,800 కోట్లు గురువారం జమ చేస్తామని తెలిపారు. ఐటీ చెల్లింపుదారుల వివరాలకోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని.. ఢిల్లీ నుంచి సమాచారం రాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలు గ్రూపులవారీగా తీసుకున్న రుణాలు, ఉద్యాన, ఇతరత్రా పంటలకోసం తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు ఈ పథకం పరిధిలోకి రావని మంత్రి స్పష్టం చేశారు. అదే మహిళలు వ్యక్తిగతంగా పట్టాదారు పాస్‌ పుస్తకం పెట్టి బ్యాంకులో స్వల్ఫకాలిక పంట రుణాలు తీసుకుంటే మాత్రం మాఫీ వర్తిస్తుందని తెలిపారు. అలాగే.. గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు సగం మందికే మాఫీ చేశారని.. వివిధ కారణాల వల్ల రూ. 1,400 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమచేయకుండా వెనక్కి తీసుకున్నారని మంత్రి తెలిపారు.


అప్పుడు రుణమాఫీ కాని రైతులు బ్యాంకుల్లో ఉన్న తమ అప్పును రెన్యువల్‌ చేసుకున్నారని, అలాంటివారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు. రుణమాఫీకి సంబంధించి.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండు విడతల్లో అనుసరించిన విధానాలనే తాము అనుసరిస్తున్నామని, తామేమీ మార్గదర్శకాలను కొత్తగా తయారుచేయలేదని తెలిపారు. ఒక కుటుంబంలో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉన్నా రూ.2 లక్షల వరకూ అప్పు మాఫీ అవుతుందని తెలిపారు. ఈ ప్రక్రియలో మహిళలకు తొలి ప్రాధాన్యం ఉంటుందని.. భార్య పేరుమీద రూ.లక్ష, భర్త పేరు మీద మరో రూ.లక్ష అప్పు ఉంటే... తొలుత భార్యపేరుమీద ఉన్న అప్పును మాఫీ చేస్తామని, తర్వాత భర్తపేరు మీద ఉన్న అప్పు మాఫీ చేస్తామని వివరించారు. పంట రుణాలు తీసుకొని చనిపోయిన రైతులు ఎవరైనా ఉంటే... వారి ఖాతాలకు కూడా రుణమాఫీ వర్తింపజేస్తామని తెలిపారు. ఆర్‌వోఎ్‌ఫఆర్‌ పట్టాలతో పంట రుణాలు తీసుకున్నా మాఫీ చేస్తామని ప్రకటించారు.

Updated Date - Jul 17 , 2024 | 04:58 AM