Share News

వైద్యవిద్యలో ఈడబ్ల్యూఎస్‌ కోటా ఏదీ?

ABN , Publish Date - Jun 15 , 2024 | 07:11 AM

త్వరలో వైద్యవిద్య ప్రవేశాల నోటిఫికేషన్‌ రానుండగా.. ‘ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)’ కోటా అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది కూడా కోటా పూర్తిస్థాయిలో అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో యూజీలో 572, పీజీలో 180 సీట్లను ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు నష్టపోనున్నారు.

వైద్యవిద్యలో ఈడబ్ల్యూఎస్‌ కోటా ఏదీ?

  • యూజీ, పీజీ ప్రవేశాల్లో కోటా అమలుపై నిర్లక్ష్యం.. ఉన్న సీట్లలోనే అమలు చేయాలన్న ఎన్‌ఎంసీ

  • ఇప్పటికీ జీవో విడుదల చేయని వైనం

  • యూజీలో 572,

  • పీజీలో 180 కోటా సీట్లు

  • కోర్టులకు వెళ్లే యోచనలో

  • విద్యార్థులు, తల్లిదండ్రులు

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): త్వరలో వైద్యవిద్య ప్రవేశాల నోటిఫికేషన్‌ రానుండగా.. ‘ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)’ కోటా అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది కూడా కోటా పూర్తిస్థాయిలో అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో యూజీలో 572, పీజీలో 180 సీట్లను ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు నష్టపోనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 56 మెడికల్‌ కాలేజీలున్నాయి. వాటిలో ఐదారు కళాశాలల్లోనే కోటా అమలు చేస్తున్నారు.

మిగిలిన కాలేజీల్లో అమలు కావడం లేదు. ఈడబ్ల్యూఎస్‌ కోటాను కేంద్రం 2019లో ప్రవేశపెట్టింది. మొత్తం సీట్లలో పదిశాతం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కేటాయించాలి. ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు చేయాలంటే ఇతరుల రిజర్వేషన్‌ దెబ్బతినకుండా ఉండేందుకు సీట్ల సంఖ్యను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా సీట్లు పెంచిన తర్వాతే కోటాను అమలు చేశారు. అన్ని రకాల విద్యా సంస్థల్లోనూ సీట్ల సంఖ్య పెంచారు. అయితే మెడికల్‌ కాలేజీల్లో మాత్రం ఇలా సీట్ల సంఖ్య పెంచడానికి వీలుకాలేదు. జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిబంధనల మేరకు ఒక మెడికల్‌ కాలేజీలో గరిష్ఠంగా 250 సీట్ల వరకు ఉండొచ్చు. అంతకుమించి సీట్ల సంఖ్యను పెంచరాదు. మన దేశంలో చాలా మెడికల్‌ కాలేజీల్లో 250 సీట్లున్నాయి.

  • ఉన్న వాటిలోనే కోటా అమలు చేయాలి..

వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచకుండానే ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేయాలని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. కన్వీనర్‌ (ఏ కేటగిరీ) సీట్లలో ఈ కోటాను అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో మెడిసిన్‌ ప్రవేశాల్లో ఈ కోటాను అమలు చేస్తున్నాయి. మనదగ్గర మాత్రమే దీన్ని పూర్తిగా అమలు చేయడం లేదు. వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాఽధికారుల నిర్లక్ష్యం వల్లే జీవో విడుదల కాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 8515 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. వీటిలో 5728 సీట్లు కన్వీనర్‌ కోటా కింద కేటాయిస్తారు.


ఈ కోటా సీట్లలో 10 శాతం ఈడబ్ల్యూఎ్‌సకు కేటాయించాలి. అంటే 572 సీట్లు ఇవ్వాలి. ప్రస్తుతం ఐదారు కాలేజీల్లో ఆ కోటా కింద వందకు పైగా సీట్లను కేటాయిస్తున్నారు. మిగిలిన కాలేజీల్లోనూ కోటాను అమలు చేస్తే అదనంగా 450 పైగా సీట్లను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కోటాను అమలు చేయాలంటే వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాలి.

కానీ, ఇంతవరకు అలాంటి కసరత్తే జరగడం లేదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆ కోటా కింద దక్కాల్సిన 450 సీట్లను ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు ఈ ఏడాది నష్టపోయే ప్రమాదం ఉంది. అలాగే పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ)లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో 2800 పీజీ సీట్లున్నాయి. ఇందులో కన్వీనర్‌ కోటా సీట్ల ఆధారంగా ఈడబ్ల్యూఎస్‌ కింద 180 పీజీ సీట్లను కేటాయించాలి. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ప్రత్యేకంగా ఇవ్వాలి. కానీ, ఇంతవరకు ఇవ్వలేదు. దాంతో యూజీ, పీజీ సీట్లను ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు నష్టపోనున్నారు.

మిగతా అన్నింట్లోనూ అమలు..

రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలోనూ ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలవుతోంది. వైద్యవిద్య యూజీ, పీజీ ప్రవేశాల్లో మాత్రమే ఈ కోటా పూర్తిస్తాయిలో అమలు కావడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైద్యవిద్య ప్రవేశాల్లో ఆరు శాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్‌ను జనాభా ప్రాతిపదికన 10 శాతానికి పెంచుతూ జీవో జారీ చేసింది. ఆ జోవో ఆధారంగా ఎస్టీలకు మెడిసిన్‌ ప్రవేశాల్లో పది శాతం సీట్లు కేటాయిస్తున్నారు. కాగా, ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలుకు సంబంధించిన జీవో ఇంతవరకు విడుదల చేయకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయించాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Updated Date - Jun 15 , 2024 | 07:12 AM