Share News

Nagarjuna: 100 కోట్లకు మరో దావా వేస్తా

ABN , Publish Date - Oct 05 , 2024 | 03:46 AM

తనపైన, తన కుటుంబంపైన అసత్యవ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై రూ.100 కోట్లకు మరో పరువు నష్టం దావా వేసే ప్రక్రియలో ఉన్నట్టు నటుడు అక్కినేని నాగార్జున చెప్పారు.

Nagarjuna: 100 కోట్లకు మరో దావా వేస్తా

కొండా సురేఖ క్షమాపణ చెప్పినా తగ్గేదే లేదు.. పరువు నష్టం దావాను ఉపసంహరించుకోను

  • సమంతకు క్షమాపణలు చెప్తే సరిపోతుందా?

  • మరి నా కుటుంబం సంగతేమిటి?: నాగార్జున

  • ‘టైమ్స్‌ నౌ’కిచ్చిన ఇంటర్వ్యూలో తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): తనపైన, తన కుటుంబంపైన అసత్యవ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై రూ.100 కోట్లకు మరో పరువు నష్టం దావా వేసే ప్రక్రియలో ఉన్నట్టు నటుడు అక్కినేని నాగార్జున చెప్పారు. ఆమె తమకు క్షమాపణలు చెప్పినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. ఇప్పటికే ఆమెపై వేసిన క్రిమినల్‌ పరువు నష్టం దావాను ఉపసంహరించుకోబోమని తేల్చిచెప్పారు. ఈ వ్యవహారంపై ‘టైమ్స్‌ నౌ’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని ఆమె చెబుతున్నారు. సమంతకు క్షమాపణ కూడా చెప్పారు. మరి.. నా కుటుంబం సంగతేమిటి? నాకూ, నా కుటుంబానికి క్షమాపణ చెప్పరా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఒకవేళ ఆమె క్షమాపణలు చెప్తే.. ఇప్పటికే వేసిన దావాను ఉపసంహరించుకుంటారా అని ప్రశ్నించగా.. లేదని స్పష్టం చేశారు. ఇకపై ఇది వ్యక్తిగత అంశం కాదని.. ఆమె చేసిన దారుణమైన ఆరోపణలు తనను, తన కుటుంబాన్ని దాటి వెళ్లాయని పేర్కొన్నారు. ఈ విషయంలో తమకు యావత్‌ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి లభిస్తున్న మద్దతు.. వ్యవస్థ లోలోతులకు విస్తరించిన తెగులును అరికట్టే ప్రక్రియలో తాము ఉన్నామన్న విషయాన్ని తనకు అర్థమయ్యేలా చేసిందని వ్యాఖ్యానించారు. ‘‘మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా పేర్లను ఉపయోగించుకోవడం దారుణం. వినోద రంగంలో ఉన్న మేము ఇకపై తేలికైన లక్ష్యాలుగా ఉండబోము. ఆమెపై చట్టపరంగా మేం తీసుకునే చర్యలు.. ఇతర రాజకీయ నేతలకు ఒక హెచ్చరికగా ఉంటాయని, తమకు అపకీర్తి కలిగించే వ్యాఖ్యలు చేయకుండా వారిని నిరోధిస్తాయని తాను భావిస్తున్నట్టు నాగార్జున తెలిపారు.


తమకు సత్వర న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది తనకు ఒకదాని వెనుక ఒకటిగా సమస్యలు వస్తున్నాయన్న మాట నిజమేని ఒప్పుకొన్న నాగార్జున.. అయినా ఇబ్బంది లేదని, తానొక బలమైన వ్యక్తినని, తన కుటుంబాన్ని రక్షించుకునే విషయంలో సింహంలా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ మొత్తం తమకు మద్దతుగా వచ్చిందని.. తన తండ్రికున్న గౌరవం, ఆయన ఆశీస్సులే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. కాగా.. నాంపల్లి కోర్టులో నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్‌ పరువునష్టం దావా కేసు శుక్రవారం విచారణకు రావాల్సి ఉంది. కానీ, న్యాయమూర్తి సెలవులో ఉండడంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది.


  • క్షమించరాని తప్పు చేశారు.. ఆమెకు తగిన శిక్ష పడాల్సిందే: అఖిల్‌

‘‘మంత్రి కొండా సురేఖ క్షమించరాని తప్పు చేశారు. విలువలతో బతికిన కుటుంబాన్ని.. రాజకీయ యుధ్ధంలో గెలవాలనే స్వార్థంతో బలిపశువును చేశారు’’ అని నటుడు అక్కినేని అఖిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాను మౌనంగా ఉండబోనని ఆయన తేల్చిచెప్పారు. ‘‘ఆమె(కొండా సురేఖ)కు తగిన శిక్ష పడాల్సిందే’ అని సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వెలిబుచ్చారు. ‘‘సమాజంలో గౌరవంగా బతికిన కుటుంబం ఆమె కారణంగా అప్రతిష్ఠకు గురైంది.


ఆమె వ్యాఖ్యలు క్షమించరానివి, సహించలేనివి. ఆమె ప్రవర్తన సిగ్గుపడేలా ఉంది. ప్రజా సంక్షేమాన్ని విస్మరించడమే కాకుండా, ఇలాంటి నిరాధార ఆరోపణలతో ఆమె తన నైతికతను ప్రశ్నార్థకం చేసుకున్నారు. తన వ్యాఖ్యల ద్వారా అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. మన సమాజంలో ఇలాంటివాళ్లకు స్థానం లేదు’’ అని అఖిల్‌ పేర్కొన్నారు. మరోవైపు ఇదే విషయమై.. ‘‘ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా మంత్రిగారూ’’ అంటూ నటుడు బ్రహ్మాజీ పెట్టిన ట్వీట్‌ వైరల్‌ అయింది.

Updated Date - Oct 05 , 2024 | 03:46 AM