Share News

Ranganath : కబ్జాలో ఉన్న విద్యా సంస్థలకు టైం ఇస్తాం

ABN , Publish Date - Aug 28 , 2024 | 05:20 AM

‘చెరువుల పరిరక్షణ ముఖ్యం. విద్యార్థుల భవిష్యత్తు అంతకంటే ప్రధానం. చెరువు ఎఫ్‌టీఎల్‌లో విద్యా సంస్థల భవనాలుంటే.. యాజమాన్యాలకు కొంత సమయం ఇస్తాం’ అని హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌(హైడ్రా) కమిషనర్‌ రంగనాథ్‌ అన్నారు.

Ranganath : కబ్జాలో ఉన్న విద్యా సంస్థలకు టైం ఇస్తాం

  • ఆలోగా యాజమాన్యాలే ఆక్రమణలను తొలగించాలి

  • లేని పక్షంలో సెలవుల్లో మేమే చర్యలు తీసుకుంటాం

  • పేదల ఇళ్లు, చిన్న గృహాలను కూల్చబోం: రంగనాథ్‌

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ‘చెరువుల పరిరక్షణ ముఖ్యం. విద్యార్థుల భవిష్యత్తు అంతకంటే ప్రధానం. చెరువు ఎఫ్‌టీఎల్‌లో విద్యా సంస్థల భవనాలుంటే.. యాజమాన్యాలకు కొంత సమయం ఇస్తాం’ అని హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌(హైడ్రా) కమిషనర్‌ రంగనాథ్‌ అన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో భవనాలను కూల్చివేస్తే పిల్లలకు ఇబ్బంది అవుతుందని తల్లిదండ్రుల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయని ఆయన తెలిపారు.

బండ్లగూడలోని సల్కం చెరువు, ఇతర చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు తొలగించాలని కోరుతూ మంగళవారం బీజేపీ కార్పొరేటర్లు రంగనాథ్‌కు వినతిపత్రం అందజేశారు. పలు చెరువుల్లో ఆక్రమణల వివరాలను రంగనాథ్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వారితో మాట్లాడారు. రాజకీయ చదరంగంలో హైడ్రా పావు కాదలచుకోలేదని, రాజకీయాలకు అతీతంగా చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని పేర్కొన్నారు.

నిబంధనలను అతిక్రమించిన జాబితాలో పాఠశాలలు, కళాశాలల భవనాలు ఉంటే మాత్రం కొంత సమయం ఇస్తామని.. పిల్లలకు ఇబ్బంది లేకుండా వాళ్లే కూల్చివేతలను చేపట్టాలన్నారు. లేని పక్షంలో విద్యాసంవత్సరం ముగిసిన అనంతరం సెలవుల సమయంలో హైడ్రా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మల్లారెడ్డి, ఒవైసీ ఎవరి విద్యా సంస్థలైనా.. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. పేదలు, చిన్న ఇళ్ల మీదకు వెళ్లబోమని.. ఎవరూ వెళ్లినా ఊరుకోబోమని స్పష్టం చేశారు. కాగా, చెరువులు ఆక్రమించి భవనాలు నిర్మించిన మల్లారెడ్డి, అక్బరుద్దీన్‌ లాంటి వాళ్లు పిల్లల వద్ద రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యను వ్యాపారంగా మార్చిన వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ కొప్పుల నరసింహారెడ్డి, కార్పొరేటర్లు శ్రవణ్‌, వంగ మధుసూదన్‌రెడ్డి తదితరులు రంగనాథ్‌ను కోరారు.

Updated Date - Aug 28 , 2024 | 05:20 AM