Share News

Medchal: గోనె సంచిలో ఏడేళ్ల బాలిక మృతదేహం

ABN , Publish Date - Oct 16 , 2024 | 03:36 AM

దసరా పండుగ రోజున అదృశ్యమైన ఏడేళ్ల బాలిక.. నాలుగు రోజుల తర్వాత మేడ్చల్‌ పరిధిలో మృతదేహంగా కనిపించింది.

Medchal: గోనె సంచిలో ఏడేళ్ల బాలిక మృతదేహం

  • తల్లి, ప్రియుడు కలిసి చంపేశారని అనుమానం

గాజులరామారం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ రోజున అదృశ్యమైన ఏడేళ్ల బాలిక.. నాలుగు రోజుల తర్వాత మేడ్చల్‌ పరిధిలో మృతదేహంగా కనిపించింది. తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉందని.. చిన్నారి తల్లి, ఆమె ప్రియుడు కలిసి.. బాలికను చంపేసి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి సూరారం ప్రాంతంలో కొంతకాలంగా నివాసం ఉంటూ, కూలి పనులు చేసుకుంటున్నారు. వీరి పక్క గ్రామానికి చెందిన తిరుపతికి ఆ దంపతులతో మంచి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో సూరారంలో ఉంటున్న వీరి ఇంటికి తిరుపతి తరచూ వచ్చేవాడు.


ఈ క్రమంలో స్నేహితుడి భార్యతో చనువు పెంచుకున్నాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. తమ సంబంధానికి దంపతుల కూతురు (7) అడ్డుగా ఉందని భావించిన తిరుపతి.. ఎలాగైనా ఆ చిన్నారిని అడ్డు తొలగించుకోవాలని భావించాడు. దసరా రోజు ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని కిడ్నాప్‌ చేసి చంపేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో మూట గట్టి మేడ్చల్‌ పరిధిలోని బాసరగడీ గ్రామం సమీపంలో చెట్ల పొదల్లో పడేశాడు.


కూతురు కనిపించకపోవడంతో బాలిక తండ్రి సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మంగళవారం మేడ్చల్‌ పరిధిలో బాలిక మృతదేహం లభించింది. పోలీసులు తిరుపతిని అదుపులోకి తీసుకొని విచారించగా విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అతనొక్కడే బాలికను హతమార్చాడా? ఇంకా ఎవరైనా ఉన్నారా? బాలిక తల్లి.. ప్రియుడికి సహకరించిందా..? వివాహేతర సంబంధమే కారణమా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 16 , 2024 | 03:36 AM