Share News

Tummla : వేములవాడలో నేతన్నలకు యారన్‌ డిపో మంజూరు

ABN , Publish Date - Oct 06 , 2024 | 03:42 AM

ఎన్నో ఏళ్లుగా సిరిసిల్ల నేతన్నలు ఎదురు చూస్తున్న యారన్‌ డిపోకు ఎట్టకేలకు మోక్షం లభించింది.

Tummla : వేములవాడలో నేతన్నలకు యారన్‌ డిపో మంజూరు

హైదరాబాద్‌/ సిరిసిల్ల, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా సిరిసిల్ల నేతన్నలు ఎదురు చూస్తున్న యారన్‌ డిపోకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రభుత్వం జీవో నంబరు 18 ద్వారా యారన్‌ డిపోను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కేంద్రంగా మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. దీని కోసం రూ. 50 కోట్ల నిధులను కేటాయించినట్లు ఆయన తెలిపారు. సిరిసిల్లలో 35 వేల మరమగ్గాలు ఉండగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మంది కార్మికులు లబ్ధి పొందుతున్నారు. పవర్‌లూమ్‌ పరిశ్రమకు లబ్ధి చేకూరే యారన్‌ డిపో మంజూరు చేయాలని కార్మికులు 30 ఏళ్లుగా కోరుతున్నారు. ఇన్నేళ్లకు సిరిసిల్ల కార్మికుల కల నేరవేరుస్తూ ప్రభుత్వం యారన్‌ డిపోను మంజూరు చేసింది.


టెస్కో ఆధ్వర్యంలో డిపోను నిర్వహించనున్నారు. దీని ద్వారా క్రెడిట్‌ పద్ధతిలో పరిశ్రమకు అవసరమయ్యే నూలును సరఫరా చేసి వస్త్రాన్ని కొనుగోలు చేయనున్నారు. వేములవాడ కేంద్రంగా యారన్‌ డిపో ఏర్పాటుపై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌గౌడ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మరో మూడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలను నియమించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నల్లగొండ జిల్లా నిడమనూరు, హనుమకొండ జిల్లా ఆత్మకూర్‌, నారాయణపేట జిల్లా కోస్గి మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలను నియమించినట్లు ఆయన చెప్పారు. వీటితో ఇప్పటివరకు 81 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాల నియామకం పూర్తయినట్లు తుమ్మల వెల్లడించారు.

Updated Date - Oct 06 , 2024 | 03:42 AM