AP Govt: ఎస్సీ వర్గీకరణకు ఓకే
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:17 AM
ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

ఏకసభ్య కమిషన్ నివేదికకు మంత్రివర్గం ఆమోదం
మూడు కేటగిరీలుగా ఎస్సీలు
గ్రూప్-1, 2, 3గా రెల్లి, మాదిగ, మాల ఉపకులాల వర్గీకరణ
ఈ సమావేశాల్లోనే అసెంబ్లీకి నివేదిక
ప్రత్యేక చర్చ అనంతరం కేంద్రానికి
రాష్ట్రం యూనిట్గా అమలుకు నిర్ణయం
విభేదిస్తున్న మాల సామాజిక వర్గం
రాష్ట్రం యూనిట్.. 200 రోస్టర్ పాయింట్లు
రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదిక, దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించింది. వీటి ప్రకారం రోస్టర్ పాయింట్లను 200గా నిర్ణయించింది. జిల్లాను యూనిట్గా చేసుకుని అమలు చేయాలని కొంత మంది మంత్రులు కోరగా, అలా చేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికారులు తెలిపినట్లు సమాచారం. 2026లో జనగణన జరిగాక జిల్లాలవారీగా అమలు చేసే అంశాన్ని పరిశీలిద్దామని, ప్రస్తుతానికి నివేదికను ఉన్నది ఉన్నట్టుగా ఆమోదిద్దామని సీఎం చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.
వర్గీకరణలో ఎవరికెంత రిజర్వేషన్?
గ్రూప్-1 (రెల్లి కులస్థులు)
సమాజంలో అత్యంత వెనుకబడి ఉండడంతో జనాభా ప్రాతిపదికన వారికి 1 శాతం రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ సిఫారసు చేసింది.
గ్రూప్-2 (మాదిగ, ఉపకులాలు) 6.5%
జనాభా దామాషాలో రెండో స్థానంలో ఉండడంతో వీరికి 6.5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ పేర్కొంది.
గ్రూప్-3 (మాల, ఉపకులాలు)7.5%
జనాభా ఎక్కువగా ఉండడంతో వీరికి 7.5 శాతం రిజర్వేషన్ కల్పించాలని నివేదిక పేర్కొంది.
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ నివేదికను ఆమోదించారు. దీనిని ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం, దీనిపై ప్రత్యేక చర్చను చేపట్టి సభ ఆమోదం తీసుకుని.. ఆ వెంటనే కేంద్రానికి పంపించనున్నారు. కాగా.. ఏకసభ్య కమిషన్ రాష్ట్రంలోని ఎస్సీలను గ్రూప్-1, 2, 3లుగా విభజించింది. గత ఏడాది నవంబరు 15న ఏకసభ్య కమిషన్ను నియమించిన ప్రభుత్వం 2 నెలల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా రాష్ట్రంలోని ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. 13 ఉమ్మడి జిల్లాల్లో ఎస్సీ సంఘాలు, మేధావులు, ఉద్యోగుల నుంచి వినతులు తీసుకున్నారు. ఎస్సీల్లోని అన్ని ఉపకులాల నేతలు, ఉద్యోగ సంఘాలతో చర్చించారు. కొన్నిచోట్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు వినతిపత్రాలు అందించారు. ఎస్సీల్లో ఏయే వర్గాలు ప్రభుత్వ ప్రయోజనాలను సమానంగా పొందలేక పోయాయన్న విషయంపై కమిషన్ దృష్టి సారించింది. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించి, ఎస్సీ ఉపకులాల జనాభాపై కూడా దృష్టి పెట్టింది. 2024 జనవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఆ గణాంకాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఎస్సీల్లో ఆయా వర్గాలు ప్రభుత్వ రంగంలో అవకాశాలు పొందలేకపోవడంపై దృష్టి పెట్టింది. ఎస్సీల్లో మాదిగలు ప్రభుత్వ ఉద్యోగాల్లో అతి తక్కువ భాగస్వామ్యం కలిగి ఉన్నారని గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా ఉద్యోగాల్లో ఎస్సీల్లోని ఏ ఉపకులం వారు ఎంతమంది ఉన్నారన్న గణాంకాలు తెలుసుకుంది.
అందరి అభిప్రాయాలు తీసుకుని..
గత ఏడాది నవంబరు 7న సచివాలయంలో 23 మంది కూటమి దళిత ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతోపాటు ఎన్నికల హామీపై కూడా వారితో చర్చించారు. జనాభా దామాషా పద్ధతిలో జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని వర్గీకరణ అమలు చేస్తామన్నారు. వర్గీకరణ అమలుపై కమిషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యేలకు వివరించారు. అప్పటి నుంచి అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఏకసభ్య కమిషన్ను నియమించారు. చంద్రబాబుతో సమావేశానికి ముందే కూటమి దళిత ఎమ్మెల్యేలు సమావేశమై దళితుల సమస్యలను చర్చించారు. టీడీపీ మేనిఫెస్టోలో ఎస్సీ రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన చేపడతామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా స్థాయిలో జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ ఏ, బీ, సీ, డీలుగా కాకుండా ఏ, బీ, సీలు వర్గీకరించాలని సూచించారు. గత ప్రభుత్వం కూడా కార్పొరేషన్లను మూడు కులాలకు మాత్రమే ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మాదిగ, మాల, రెల్లి, ఇతర వర్గాలుగా విభజించాలని కోరారు. ఎస్సీ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వేషన్లను 16 నుంచి 18 శాతానికి పెంచాలని ఎమ్మెల్యేలు కోరారు.
నివేదికపై అభ్యంతరాలు ఇవీ...
ఏకసభ్య కమిషన్.. గత వైసీపీ ప్రభుత్వం వలంటీర్ల ద్వారా చేపట్టిన గణనను ప్రాతిపదికగా చేసుకుంది. అయితే, ఆ సర్వే లోపభూయిష్టంగా ఉందన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సదరు సర్వేను పునఃసమీక్షించాలని ఎస్సీ మాల సామాజిక వర్గ నేతలు కోరుతున్నారు.
గతంలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగ నియామక దరఖాస్తుల్లో ఎస్సీ ఉపకులాలను పేర్కొనలేదని, జాబితాల్లోనూ తప్పులున్నాయని చెబుతున్నారు.
కొత్తగా పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకుని కుల గణన చేపట్టాలని, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల సర్వేను పరిగణనలోకి తీసుకోవద్దని కోరుతున్నారు.
వైసీపీ హయాం నాటి సర్వే ఆధారంగా నిర్ణయించే వర్గీకరణ.. అన్ని వర్గాలకు న్యాయం చేయదని అంటున్నారు.
రాష్ట్రంలో 26 జిల్లాలు ఉంటే కమిషన్ ఉమ్మడి 13 జిల్లాల్లోనే పర్యటించిందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ ఉపకులాల నివాసిత ప్రాంతాల్లో కమిషన్ పర్యటించలేదని అంటున్నారు.
100 రోజుల్లో నివేదిక అనేది చాలా తక్కువ సమయమని, కేవలం డీఎస్సీలో రిజర్వేషన్లు అమలు చేసేందుకు హడావుడి చేశారని ఆరోపిస్తున్నారు.
జస్టిస్ రామచంద్ర కమిషన్ను 1996లో నియమిస్తే.. నివేదిక 1997లో ఇచ్చిందని, జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ను 2006లో నియమిస్తే 2007లో నివేదిక ఇచ్చారని.. ప్రస్తుత అధ్యయనం అతి తక్కువ సమయంలో పూర్తి చేశారని పేర్కొంటున్నారు.
ఆయా శాఖలపై అనుభవం లేని రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించడమెందుకని, రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసి ఉంటే బాగుండేదని చెబుతున్నారు.