Share News

AP Police : మార్ఫింగ్‌పై 9 గంటల విచారణ

ABN , Publish Date - Feb 08 , 2025 | 03:19 AM

సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శుక్రవారం ఒంగోలులో పోలీసు విచారణకు హాజరయ్యారు. మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో గతేడాది నవంబరులో...

AP Police : మార్ఫింగ్‌పై 9 గంటల విచారణ

  • ఒంగోలు పోలీసుల ముందుకు ఆర్జీవీ

  • సోషల్‌ మీడియాలో మార్ఫింగ్‌ ఫొటోలపై సుదీర్ఘ విచారణ.. ఫైబర్‌నెట్‌ సొమ్ముపై మౌనం

  • ఆయన సెల్‌ఫోను అడిగిన విచారణాధికారి

  • తీసుకురాలేదన్న వర్మ.. కానీ స్థానిక వైసీపీ కార్యాలయాన్ని చూపిన సెల్‌ లొకేషన్‌

  • పోలీసులు వెళ్లి వెతికినా దొరకని వైనం

  • ఈసారి విచారణకు ఫోన్‌ తేవాలని స్పష్టీకరణ

  • వైసీపీ నేతలతో వ్యక్తిగత పరిచయాలేనన్న వర్మ

  • మరో కేసులో ఎల్లుండి రావాలని సీఐడీ నోటీసులు

  • ఒంగోలు పోలీసుల ముందుకు ఆర్జీవీ

ఒంగోలు క్రైం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ ఫొటోలు మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమంలో పెట్టిన వ్యవహారంపై సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శుక్రవారం ఒంగోలులో పోలీసు విచారణకు హాజరయ్యారు. మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో గతేడాది నవంబరులో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనికి సంబం ధించి శుక్రవారం మధ్యాహ్నం 12గంటలకు ఆయన ఒంగోలు రూరల్‌ స్టేషన్‌కు వచ్చి విచారణాధికారి సీఐ శ్రీకాంత్‌బాబు ఎదుట హాజరయ్యారు. కారులో ఆయన వెంట ఓ మహిళ, ఒక అసిస్టెంట్‌ కూడా వచ్చారు. ఆర్జీవీతో పాటు స్షేషన్‌లోకి వెళ్లేందుకు సదరు అసిస్టెంట్‌ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మహిళ కారులోనే ఉండిపోయారు. రాత్రి 9 గంటలకు విచారణ ముగిసింది. 9 గంటలపాటు ఆయన్ను ప్రశ్నించారు. మొదటి 5గంటల విచారణలో మూడుసార్లు టీ బ్రేక్‌ ఇచ్చారు. విచారణలో ఎక్కువ సమయం వర్మ సెల్‌ఫోన్‌పైనే సాగినట్లు తెలిసింది. ఆ ఫోన్‌ను పరిశీలించాలని విచారణాధికారి అడుగగా.. తాను తీసుకురాలేదని, హైదరాబాద్‌లోనే ఉంచి వచ్చినట్లు సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో సెల్‌ లొకేషన్‌ కనిపెట్టారు. ఆ సిగ్నల్‌ స్థానిక వైసీపీ కార్యాలయం వద్ద చూపడంతో పోలీసులు అక్కడకు వెళ్లగా వర్మ వచ్చిన కారు అక్కడే ఉంది. అక్కడ వెతికినా ఫోన్‌ దొరక్కపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. వైసీపీ నాయకులతో ఉన్న సంబంధాలపై విచారణాధికారి ప్రశ్నించగా.. వారితో వ్యక్తిగత పరిచయాలు మాత్రమే ఉన్నాయని ఆర్జీవీ చెప్పినట్లు సమాచారం.


మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి స్నేహితుడు కాబట్టే కలిశానని సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఫైబర్‌నెట్‌ నుంచి అందుకున్న రూ.2 కోట్లపై ప్రశ్నించగా నోరు విప్పలేదని సమాచారం. మరోసారి విచారణకు రావలసి ఉంటుందని విచారణాధికారి చెప్పినట్లుతెలిసింది. వచ్చేటప్పుడు సెల్‌ఫోన్‌తో రావాలని కోరినట్లు సమాచారం. కాగా.. వర్మకు సీఐడీ కూడా నోటీసులు ఇచ్చింది. ఈ నెల 10న గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాలంటూ ఒంగోలు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఆయనకు సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు అందజేశారు. 2019లో ఆర్జీవీ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తీశారు. అందులోని సన్నివేశాలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గత నవంబరు 29న సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

వర్మకు వైసీపీ నేతల స్వాగతం

పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన రామ్‌గోపాల్‌ వర్మకు మద్దిపాడులోని ఓ ప్రైవేటు హోటల్‌ వద్ద వైసీపీ నేతలు సాదరంగా స్వాగతం పలికారు. ఆయన్ను కలిసినవారిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణతో పాటు పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు. ‘మీకు అండగా మేమున్నాం’ అని వారు భరోసా ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..

Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం

Updated Date - Feb 08 , 2025 | 03:19 AM

News Hub