Tirupati Airport: తిరుపతి విమానాశ్రయంలో అతిపెద్ద రన్వే
ABN , Publish Date - Feb 21 , 2025 | 03:40 AM
ప్రస్తుతం ఈ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న 2,285 మీటర్ల రన్వేను రూ.156.16 కోట్లు వెచ్చించి 3,810 మీటర్లకు విస్తరించారు.

రేణిగుంట, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రాష్ట్రంలోనే అతిపెద్ద రన్వే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న 2,285 మీటర్ల రన్వేను రూ.156.16 కోట్లు వెచ్చించి 3,810 మీటర్లకు విస్తరించారు. ఈ సందర్భంగా గురువారం విమానాశ్రయంలో ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీ గురుమూర్తి, విమానాశ్రయ అడ్వైజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టు డైరెక్టర్ మానే శ్రీనివాస్ మాట్లాడుతూ.. తిరుపతి విమానాశ్రయంలో రన్వేను విస్తరించడంతో విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల కన్నా పెద్ద రన్వే ఏర్పడిందన్నారు. విమానాలు మలుపు తిరిగే ప్రాంతాన్ని కూడా 700 మీటర్ల నుంచి 1500 మీటర్లకు పెంచామన్నారు. దీంతో పెద్ద విమానాలు సులువుగా మలుపు తిరగవచ్చన్నారు. ఇక్కడికి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపేందుకు చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. కాగా.. రన్వేపై లైటింగ్ పనులు కారణంగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 నుంచి శనివారం ఉదయం 5 గంటల వరకూ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నామని తెలిపారు.