Hyderabad: కుమార్తెకు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేకే భర్తను చంపేసింది
ABN , Publish Date - Apr 23 , 2025 | 10:19 AM
రానురాను మానవ సంబంధాలు ఎలా మారుతున్నాయో తెలియజేసే సంఘటన ఇది. అన్నేళ్లు కలిసి కాపురం చేసిన భర్తనే కడతేర్చింది. కుమార్తెకు భర్త కుదిర్చిన పెళ్లి ఇష్టం లేకపోవడం, ఇద్దరి మధ్యా సఖ్యత ఉండకపోవడంతో అతడిని చంపేసి పూడ్చిపెట్టింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరం కూకట్పల్లి ఏరియాలో చోటుచేసుకుంది.
- చెల్లెలు, ఆమె భర్తతో కలిసి ఘాతుకం
- కూకట్పల్లి ఘటనలో వివరాలు వెల్లడించిన ఏసీపీ
హైదరాబాద్: కుమార్తెకు భర్త కుదిర్చిన పెళ్లి ఇష్టం లేకపోవడం, ఇద్దరి మధ్యా సఖ్యత ఉండకపోవడంతో అతడిని చంపేసి పూడ్చిపెట్టింది. భర్తను చంపి.. శవాన్ని పూడ్చిన కేసు వివరాలను కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు మంగళవారం వెల్లడించారు. మెదక్(Medak) జిల్లా పాపన్నపేట్ మండలం పాత లింగాయపల్లికి చెందిన బోయిని సాయిలు(45)కు, కవిత(42)తో 20ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె శ్వేత, కుమారుడు బన్నీ ఉన్నారు. దంపతుల మధ్య సఖ్యత లేకపోవడంతో సాయిలు పిల్లలతో పాత లింగాయపల్లిలోనే పనిచేసుకుంటూ నివాసం ఉంటున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఉప్పల్లో నేడు బిగ్ ఫైట్..
ఇటీవల కుమార్తె శ్రావ్యకు సాయిలు చెల్లెలు కుమారుడితో పెళ్లి నిశ్చయించినట్లు కవితకు తెలిపాడు. సాయిలు చూసిన సంబంధం కవితకు నచ్చలేదు. దీంతో తరచూ అతడిని అవమానిస్తూ మాట్లాడేది. అంతేకాకుండా, చెల్లెలు జ్యోతి, ఆమె భర్త మల్లేష్ తో కలిసి సాయిలు హత్యకు పథకం వేసింది. ఈనెల 12న ఊరువెళ్లిన కవిత ఉద్యోగం చూపిస్తానని భర్తను తీసుకొచ్చి, ఓ బిల్డింగ్ వద్ద వాచ్మన్గా కుదిర్చింది. గత శుక్రవారం రాత్రి భర్త సాయిలు, కవిత, ఆమె సోదరి జ్యోతి, మల్లేశ్ నలుగురూ మిత్రాహిల్స్లో జ్యోతి ఇంటి దగ్గర మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న సాయిలుకు కవిత, జ్యోతి కరెంటు వైర్తో షాక్ ఇచ్చి హత్యకు ప్రయత్నించారు.
అతడు మృతిచెందక పోవడంతో సోదరి సాయంతో మెడకు తువ్వాలను చుట్టి, ఆపై వృషణాలపై తన్ని హత్య చేశారు. మృతదేహాన్ని ఓ పట్టాలో చుట్టారు. ఆటోలో తీసుకెళ్లి జోగిపేట దగ్గర శ్మశానంలో పడేసేందుకు యత్నించారు. అనుమానం వచ్చిన ఆటోడ్రైవర్ వారిని ఊరిలో లేదా, ఎక్కించుకున్న చోటే దింపుతానని చెప్పి, మిత్రాహిల్స్లో వదిలిపెట్టాడు. దీంతో కవిత, జ్యోతి, మల్లేష్ లు మృతదేహాన్ని మిత్రహిల్స్ పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో పాతిపెట్టారు. సాయిలు మృతదేహాన్ని తరలించిన ఆటోడ్రైవర్ ఫిర్యాదుతో విషయం బయటకు వచ్చింది.

కేపీహెచ్బీ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సాయిలు మృతదేహాన్ని వెలికితీయించి, కూకట్పల్లి తహసీల్దార్ సమక్షంలో గాంధీ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి అనంతరం బంధువులకు అందజేశారు. పోలీసులకు సమాచారం అందించిన ఆటోడ్రైవర్ నాయక్కు రివార్డు అందిస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి, డీఐ రవికుమార్, ఎస్ఐలు లింగం, మన్యం, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్టీసీలో సమ్మెకు సై...జేఏసీకి సంఘాల మద్దతు
Singareni: సింగరేణి ఉపకార వేతనం
Read Latest Telangana News and National News