‘హిండెన్బర్గ్ రిసెర్చ్’ మూసివేత
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:47 AM
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని కుదిపేసి, ఆయన కంపెనీల నుంచి రూ.వందల కోట్లు ఆవిరి చేసి అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ ‘హిండెన్బర్గ్ రిసెర్చ్ సంస్థ’ మూతపడింది.

వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ ప్రకటన
ఎవరి ఒత్తిళ్లు, బెదిరింపులూ లేవని వెల్లడి
సంస్థను నడపడం సాహసం అని వ్యాఖ్య
జీవితంలో ఒక అధ్యాయంగా అభివర్ణన
వాషింగ్టన్/న్యూఢిల్లీ, జనవరి 16: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని కుదిపేసి, ఆయన కంపెనీల నుంచి రూ.వందల కోట్లు ఆవిరి చేసి అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ ‘హిండెన్బర్గ్ రిసెర్చ్ సంస్థ’ మూతపడింది. ఈ మేరకు ఆ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్(నేట్) ఆండర్సన్ గురువారం ప్రకటించారు. తాము ఎంచుకున్న ప్రణాళికలు పూర్తయిన తర్వాత సంస్థను మూసేయాలన్న ఆలోచన ఉందని, ఆది ఈ రోజే.. అని సంస్థ వెబ్సైట్లో పోస్టు చేసిన లేఖలో ఆయన తెలిపారు.
ఈ సంస్థను నడపడం జీవితకాల సాహసంగా ఆయన అభివర్ణించారు. ‘ఈ నిర్ణయం వెనుక ఎలాంటి కారణాలు, బెదిరింపులు, ఆరోగ్య కారణా లు, వ్యక్తిగతమైన అంశాలు ఏమీ లేవు. గతంలో నన్ను నేను నిరూపించుకోవాలని భావించేవాడిని. ఇప్పుడు జీవితంలో తొలిసారిగా నేను కంఫర్ట్ జోన్ లో ఉన్నానని అనిపిస్తోంది. హిండెన్బర్గ్ సంస్థను నన్ను నిర్వచించే ప్రధాన విషయంగా కాకుండా.. నా జీవితంలో ఒక అధ్యాయంగా మాత్రమే చూస్తున్నాను’ అని ఆ లేఖలో ఆండర్సన్ వెల్లడించారు. కాగా, హిండెన్బర్గ్ సంస్థ మూసివేయడం అంటే మోదానీకి క్లీన్చిట్ ఇచ్చినట్లు కాదని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది.