Bangladesh: బంగ్లా విముక్తి పోరాటంలో భారత్ పాత్రను తగ్గించేశారు!
ABN , Publish Date - Mar 01 , 2025 | 05:55 AM
బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారతదేశ పాత్రను తగ్గిస్తూ ఆ దేశం మధ్యంతర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేసింది.

బంగ్లాదేశ్ పాఠ్యపుస్తకాల్లో సమూల మార్పులు
ఢాకా, ఫిబ్రవరి 28: బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారతదేశ పాత్రను తగ్గిస్తూ ఆ దేశం మధ్యంతర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేసింది. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించడంలో కీలక పాత్ర పోషించిన ముజీబుర్ రెహ్మాన్, ఆయన కుమార్తె, మాజీ ప్రధాని షేక్ హసీనాల భాగస్వామ్యాన్ని కూడా పూర్తిగా తగ్గించి చూపేలా పుస్తకాలను మార్చేసింది. రానున్న విద్యా సంవత్సరం కోసం 40 కోట్ల కొత్త పాఠ్యపుస్తకాలను ముద్రించారు.
అన్ని పాఠ్య పుస్తకాల నుంచి మాజీ ప్రధాని షేక్ హసీనా పేరును పూర్తిగా తొలగించారు. దీంతో పాటు బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రాలను కూడా తొలగించడం గమనార్హం. కాగా, బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా తొలుత భారత్ 1971, డిసెంబరు 6న గుర్తించినట్లుగా గతంలో పేర్కొన్నారు. తాజాగా, తొలుత భూటాన్ (1971, డిసెంబరు 3న) బంగ్లాను స్వతంత్ర దేశంగా గుర్తించినట్లు మార్పులు చేయనున్నారు.