Rahul Gandh: ఎన్నికల సంఘం రాజీ పడింది
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:26 AM
అమెరికాలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ఎన్నికల సంఘం రాజీ పడిందని, మహారాష్ట్ర ఎన్నికలు దీనికి ఉదాహరణ అని ఆరోపించారు.
ఈసీ వ్యవస్థలో లోపం ఉంది
అమెరికాలో రాహుల్ సంచలన వ్యాఖ్యలు
బోస్టన్, భోపాల్, న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: భారత ఎన్నికల సంఘంపై అమెరికాలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం రాజీ పడిందని, అందుకు మహారాష్ట్ర ఎన్నికలే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బోస్టన్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గతేడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో.. ఉన్న ఓటర్ల కంటే ఎక్కువ మందే ఓట్లు వేశారని రాహుల్ చెప్పారు. ‘‘మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల మధ్య 65 లక్షల ఓట్లు పోల్ అయ్యాయని ఈసీ వెల్లడించింది. కానీ ఇది అసంభవం. సగటున ఒక ఓటుకు 3 నిమిషాలు పట్టినా అన్ని ఓట్లు పోల్ అవ్వాలంటే అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగి ఉండాలి. కానీ అలా జరగలేదు. మహారాష్ట్ర పోలింగ్ గురింగి మేం వీడియో కోసం మేం అడగగా అందుకు ఈసీ ఒప్పుకోలేదు. ఇప్పుడు వీడియో గురించి అడగడానికి వీలు లేకుండా చట్టాన్నే మార్చేశారు’’ అని పేర్కొన్నారు. దీనిని బట్టి ఈసీ రాజీ పడినట్లు స్పష్ఠమవుతోందని, ఈసీ వ్యవస్థలోనే లోపం ఉందని అన్నారు. భారత్ - అమెరికా సంబంధాలపై కూడా రాహుల్ మాట్లాడారు. అమెరికాతో మనకు భాగస్వామ్యం ఉందని, ఇరు దేశాలు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నానని అన్నారు.
రాహుల్ పౌరసత్వంపై బ్రిటన్కు లేఖ: కేంద్రం
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందన్న ఆరోపణలపై సమాచారం ఇవ్వాలంటూ ఆ దేశానికి లేఖ రాశామని కేంద్రం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కేసుపై విచారణ జరుపుతున్న అలహాబాద్ హైకోర్టు లఖ్నవూ బెంచ్కు సోమవారం ఈ విషయాన్ని తెలిపింది. దీనిపై పూర్తి వివరాలు ఇచ్చేందుకు మరికొంత సమయం కోరింది.