Judges Transfer: తెలంగాణ హైకోర్టు నుంచి ఇద్దరు న్యాయమూర్తుల బదిలీ
ABN , Publish Date - Apr 22 , 2025 | 05:26 AM
తెలంగాణ హైకోర్టు నుంచి ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ పెరుగు శ్రీసుధ కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్ కాసోజు సురేందర్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు
జస్టిస్ పెరుగు శ్రీసుధ కర్ణాటక హైకోర్టుకు
జస్టిస్ కాసోజు సురేందర్ మద్రా స్కు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఏప్రిల్ 15 నుంచి 19 వరకు జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. బదిలీ అయిన వారిలో కర్ణాటక హైకోర్టుకు చెందిన నలుగురు, తెలంగాణ హైకోర్టు నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు ఉన్నారు. కర్ణాటక హైకోర్టుకు చెందిన జస్టిస్ హేమంత్ చందన్ గౌడర్ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ కృష్ణన్ నటరాజన్ను కేరళ హైకోర్టుకు, జస్టిస్ నెరనహళ్లి శ్రీనివాసన్ సంజయ్ గౌడను గుజరాత్ హైకోర్టుకు, జస్టిస్ దీక్షిత్ కృష్ణ శ్రీపాద్ను ఒడిశా హైకోర్టుకు బదిలీ చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పెరుగు శ్రీ సుధను కర్ణాటకకు, జస్టిస్ కాసోజు సురేందర్ను మద్రాస్ హైకోర్టుకు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మథరావును కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది.