Team India: సెలెక్షన్లో ప్రాంతీయ భేదాలు.. ఇదెక్కడి న్యాయం..
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:51 PM
Shubman Gill: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్మన్ గిల్ పేరు ఇప్పుడో కొత్త వివాదంలో వినిపిస్తోంది. ప్రాంతీయత ఆధారంగా ఆటగాళ్ల సెలెక్షన్, కొనసాగింపు అన్యాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలేంటీ కాంట్రవర్సీ? అనేది ఇప్పుడు చూద్దాం..

భారత క్రికెట్లో ఉత్తరాది బోర్డుల హవా నడుస్తుండటం తెలిసిందే. ఎక్కువగా మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్కు చెందిన ఆటగాళ్లను టీమిండియాలోకి తీసుకుంటారనే అపప్రద ఎప్పటినుంచో ఉంది. ముఖ్యంగా ముంబై లాబీ బాగా పని చేస్తుందనే కామెంట్స్ వస్తుంటాయి. ఆ జోన్కు చెందిన ప్లేయర్లు ఫెయిలైనా టీమ్లో నుంచి తీసేయరని అంటుంటారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీ లాంటి సౌత్ స్టేట్స్ నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. నార్త్ హవాలో ఇక్కడి వారికి అన్యాయం జరుగుతోందని విమర్శలు వస్తుంటాయి. తాజాగా మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ దీనిపై రియాక్ట్ అయ్యాడు. టీమిండియా సెలెక్షన్లో ప్రాంతీయ భేదాలు ఉన్నాయని స్పష్టం చేశాడు. యంగ్ బ్యాటర్ శుబ్మన్ గిల్ ఎంపికపై అతడు ఫైర్ అయ్యాడు.
అప్పుడే తీసేసేవారు!
‘ఒకవేళ శుబ్మన్ గిల్ తమిళనాడు ఆటగాడైతే అతడ్ని ఎప్పుడో జట్టులో నుంచి తీసేసేవారు. అతడి గేమ్ బాగోలేదు. టీమిండియాకు ఆడుతున్నాడంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. కానీ వాటిని అతడు అందుకోవడం లేదు. ఒక బ్యాటర్ పరుగులు చేయొచ్చు లేదా చేయకపోవచ్చు. కానీ పరుగులు చేయాలనే దాహం, కసి, తపన ఉండాలి. బౌలర్లను అలసిపోయేలా చేయాలి. వాళ్లను విసిగించాలి. బాల్ పాతబడే దాకా క్రీజులో పాతుకుపోవాలి. పరుగులు రాకపోయినా ఒక ఎండ్ను కాపాడుతూ సహచరులకు అండగా ఉండాలి. కానీ గిల్ ఆ పని చేయడం లేదు’ అని బద్రీనాథ్ విమర్శించాడు.
గిల్ కాంట్రిబ్యూషన్ సున్నా!
93.. గత మూడు టెస్టుల్లో కలిపి గిల్ చేసిన పరుగులు. ఇందులో అతడి బెస్ట్ స్కోరు 31. దీన్ని టార్గెట్ చేసుకొనీ బద్రీనాథ్ సీరియస్ అయ్యాడు. నేను నిలబడే పరుగుల వరద పారిస్తాను, నేను ఇలాడే ఆడతానంటూ గొప్పలు చెప్పడం కాదు.. ఏదైనా చేసి చూపించాలన్నాడు. ఫీల్డింగ్లోనూ అతడు పొడిచిందేమీ లేదని.. జట్టులో ఉండటం వేస్ట్ అని, అతడి కాంట్రిబ్యూషన్ సున్నా అంటూ ఫైర్ అయ్యాడు బద్రీనాథ్. ప్రాంతీయత, పాపులారిటీ ప్రకారం ఆటగాళ్ల సెలెక్షన్, కంటిన్యూయేషన్ ఉండొద్దని సూచించాడు. టాలెంట్ ఉన్న ప్లేయర్లు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని.. వాళ్ల ప్రతిభను వృథా చేయొద్దని కోరాడు. ఏ ఆటగాడైనా సరిగ్గా ఆడకపోతే తీసేయాలని.. అందరికీ ఒకే న్యాయం ఉండాలని ఇన్డైరెక్ట్ కామెంట్స్ చేశాడు.