Share News

Investigation: భూదాన్‌ భూ అక్రమాలపై ఐఏఎస్‌లతో త్రిసభ్య కమిటీ

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:00 AM

భూదాన్‌ భూముల అక్రమాలపై విచారణకు ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు ఒక మెమోను హైకోర్టు ఎదుట దాఖలు చేసింది.

Investigation: భూదాన్‌ భూ అక్రమాలపై ఐఏఎస్‌లతో త్రిసభ్య కమిటీ

  • మూడు వారాల్లో నివేదిక ఇస్తుంది

  • హైకోర్టుకు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): భూదాన్‌ భూముల అక్రమాలపై విచారణకు ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు ఒక మెమోను హైకోర్టు ఎదుట దాఖలు చేసింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నాగారంలోని సర్వే నం.181, 182లోని 103 ఎకరాల భూముల విషయంలో అక్రమాలు జరిగాయని.. అప్పటి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లకు అనుమతులిచ్చారన్న ఆరోపణలతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.


సీనియర్‌ ఐఏఎ్‌సలు నవీన్‌ మిట్టల్‌, రఘునందన్‌రావు, శశాంకతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వన్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ కమిటీ మూడు వారాల్లో రికార్డులన్నీ పరిశీలించి నివేదిక ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వం దాఖలు చేసిన మెమోను పరిశీలించాలని.. ఆ తర్వాత వాదనలు వింటామని పేర్కొంటూ విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.

Updated Date - Apr 10 , 2025 | 04:00 AM