దేశాన్ని విభజింటే కుట్ర.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:42 PM
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తూ.. దేశ విభజకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

కరీంనగర్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ కీలక నేత.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ విభజనకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం నాడు కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు దేశ విభజనకు కుట్ర చేస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక రాబోయో రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
"కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తామని ప్రచారం చేసుకుంటుంది.. కానీ వాటిని ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం.. అందుకే కచ్చితంగా మోదీ ఫొటో పెట్టాలి. ప్రజలకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తుంది.. ఒక్క కేజీ బియ్యం మీద కేంద్రం 40 రూపాయలు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ.. కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తుంది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది" అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని.. అక్రమాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది అన్నారు బండి సంజయ్. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబంపై చర్య తీసుకోవాలని తెలంగాణ సమాజం, బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం పగ తీర్చుకోమంటూ చేస్తోన్న వ్యాఖ్యలని చూస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకే గూటికి చెందినవని జనాలకు అర్థం అవుతుందంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
"దక్షిణాది రాష్ట్రాల పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ విభజనకు కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మతం పేరుతో దేశాన్ని విభజించింది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పేరుతో దేశ విభజకు కుట్ర చేస్తుంది. వీళ్ళను రాళ్లతో కొట్టాలి" అన్నారు బండి సంజయ్
మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసే పని చేశాయని బండి సంజయ్ ఆరోపించారు. అలానే రాబోయో నగర పాలక ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ అవినీతి వైరస్ సోకించిందని.. అయితే దానికి తమ పార్టీ వ్యాక్సిన్ కనుకుందన్నారు బండి సంజయ్. బడా నాయకుడి నుంచి చోటా నాయకుడి వరకు అవినీతి సోకిందని.. దానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ.. ప్రజా ఆందోళన అనే వాక్సిన్ ద్వారా కాంగ్రెస్పై పోరాడుతాం అని బండి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం..
బ్యాంకాక్ భూకంపం.. క్షేమంగా హైదరాబాద్కు తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం