Hyderabad: హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలం
ABN , Publish Date - Jan 12 , 2025 | 03:54 AM
తెలంగాణ హౌసింగ్ బోర్డు పరిధిలోని చిన్న, చిన్న ప్లాట్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్కు ఉత్తరం, పడమర, దక్షిణ బోర్డు పరిధిలో ఉన్న 72 ప్లాట్లను త్వరలో విక్రయించేందుకు కసరత్తు పూర్తిచేసింది.

మొత్తం 73ప్లాట్లు.. 4,880 చదరపు గజాలు
రావిర్యాలలోనూ 42 ప్లాట్ల విక్రయం
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హౌసింగ్ బోర్డు పరిధిలోని చిన్న, చిన్న ప్లాట్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్కు ఉత్తరం, పడమర, దక్షిణ బోర్డు పరిధిలో ఉన్న 72 ప్లాట్లను త్వరలో విక్రయించేందుకు కసరత్తు పూర్తిచేసింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్కు పడమరలో 3,040.18 చదరపు గజాల ప్లాట్లు 24, ఉత్తరాన 566.09 చ.గజాలు ప్లాట్లు 07, దక్షిణాన 1,274.71 చదరపు గజాల్లో 42 ప్లాట్లు కలిపి మొత్తం 4,880.98 చదరపు గజాల్లో 73 ప్లాట్లు ఉన్నాయి. ఇవి ఒక్కోటి 6 నుంచి 220 చ.గజాల వరకు ఉన్నాయి.
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని ప్లాట్లకు అక్కడి మార్కెట్ ధరను బట్టి గజం రూ.1.25లక్షలు, గచ్చిబౌలిలో గజం రూ.1.50లక్షలు, రావిర్యాలలో రూ.75వేల చొప్పున నిర్ణయించింది. కాగా, రావిర్యాల దగ్గర తెలంగాణ హౌసింగ్ బోర్డు కాలనీలోని ఇళ్ల మధ్య ఉన్న 42 ప్లాట్లకు వేలం నిర్వహిస్తున్నట్టు బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 5న రావిర్యాల తెలంగాణ హౌసింగ్ బోర్డు కాలనీలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్టు తెలిపింది. అయితే వేలంలో పాల్గొనేవారు రూ.లక్ష, రెండు లక్షల డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)లను వేలం ప్రారంభమవడానికి 30 నిమిషాల ముందు డిపాజిట్ చేయాలని పేర్కొంది.