CM Revanth Reddy: దొంగలు, దోపిడీదారులను బట్టలిప్పి నిలబెడతా: సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:20 PM
కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు ఎలా సంపాదించిందో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ సంపాదన సీక్రెట్ ఏంటో ప్రజలకూ చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం నెలకు రూ.లక్ష సంపాదించే నైపుణ్యమైనా యువతకు చెప్పాలని అన్నారు.

జనగామ: తెలంగాణకే ఆదర్శంగా స్టేషన్ ఘన్పూర్ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రూ.800 కోట్లతో స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు సీఎం తెలిపారు. ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రాంతం వరంగల్ అని, వరంగల్కు ఎయిర్పోర్టును కూడా సాధించుకున్నామని అన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం శివునిపల్లెలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి రూ.5,500 కోట్లు చెల్లించామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.20,617 కోట్లతో రైతుల రుణాలు మాఫీ చేశామని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని, ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే ఉన్నామని అన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.."తెలంగాణ అప్పులు గురించి రాష్ట్ర ప్రజలకు తెలియాలి. తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారు. కేసీఆర్ రూ.8.29 లక్షల కోట్ల అప్పులు పెట్టి పోయారు. రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నాం. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు ఎగ్గొడితే.. రూ.7,200 కోట్లు మేం చెల్లించాం. గ్రూప్ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తున్నాం. అన్ని వర్గాల ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాం. కేసీఆర్ రూ.లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మించారు. నిర్మించిన మూడేళ్లకే అది కూలిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరమని ప్రజలే అంటున్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో కట్టినవే. ఏటా తెలంగాణలో 1.56 కోట్ల టన్నుల ధాన్యం పండింది. తెలంగాణలో ప్రాజెక్టులపై చర్చకు కేసీఆర్ సిద్ధమా?. ఏ టైమ్ అయినా.. ఏ ప్రాజెక్టుపై అయినా చర్చకు నేను సిద్ధం. కేసీఆర్, హరీశ్ రావు ఇద్దరూ రండి తేల్చుకుందాం.
కేసీఆర్ ఫామ్హౌస్కే పరిమితమయ్యారు. ఆయన తన అనుభవం తెలంగాణ ప్రజలకు ఎందుకు ఉపయోగించరు?. రాష్ట్రాభివృద్ధి కేసీఆర్కు పట్టదా?. తీసుకుంటున్న జీతానికైనా ఆయన న్యాయం చేయాలి. కల్వకుంట్ల కుటుంబం రూ.లక్ష కోట్లు ఎలా సంపాదించింది?. ఆ సంపాదన సీక్రెట్ ఏంటో ప్రజలకూ చెప్పండి. కనీసం నెలకు రూ.లక్ష సంపాదించే నైపుణ్యం యువతకు చెప్పండి. తెలంగాణను పాపాలపుట్ట మాదిరి అప్పులపాలు చేశారు. దొంగలు, దోపిడీదారులను బట్టలిప్పి బజారులో నిలబెడతా. కేసీఆర్ పాపాల చిట్టా మొత్తం విప్పుతా. కేసీఆర్ను జాతిపిత అని హరీష్రావు అంటున్నారు. ఆ జాతిపితకు.. కేసీఆర్కు పోలిక ఉందా?. అసలైన జాతిపితకు మందు వాసన తెలుసా?. అసలైన జాతిపిత దళిత వాడల్లో జీవితం గడిపితే.. మరి ఈ జాతిపిత ఎక్కడున్నారు?. తెలంగాణ జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ.. తెలంగాణ జాతిపిత అంటే ప్రొ. జయశంకర్" అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: కేసీఆర్.. నీ కుటుంబాన్ని అదుపులో పెట్టుకో!
Venkaiah Naidu: మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలి