ఆ యువతి గొంతులో పచ్చి ఆకుల ఆనవాళ్లు.. అనారోగ్యంతోనే నవవధువు చనిపోయిందనుకున్నారు కానీ.. పోస్ట్మార్టం రిపోర్ట్లో..
ABN , First Publish Date - 2022-02-13T01:46:11+05:30 IST
ఏళ్లు గడిచే కొద్దీ వారిలో మొదట్లో ఉన్న అన్యోన్యత, అభిమానం ఉంటుందో ఉండదో తెలీదు గానీ.. పెళ్లయిన కొత్తలో మాత్రం కలసిమెలసి ఉంటారు. అయితే గుజరాత్లో కొత్తగా పెళ్లయిన జంటలో మాత్రం..
పెళ్లయిన కొత్తలో దంపతులు ఎంత అన్యోన్యంగా.. ఎంత సంతోషంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏళ్లు గడిచే కొద్దీ వారిలో మొదట్లో ఉన్న అన్యోన్యత, అభిమానం ఉంటుందో ఉండదో తెలీదు గానీ.. పెళ్లయిన కొత్తలో మాత్రం కలసిమెలసి ఉంటారు. అయితే గుజరాత్లో కొత్తగా పెళ్లయిన జంటలో మాత్రం.. అలాంటి ఆనందం కొన్ని రోజులు కూడా లేదు. నవ వధువు అకస్మాత్తుగా చనిపోవడంతో అనారోగ్య కారణంగానే అని అనుకున్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..
గుజరాత్లోని వల్సాద్ అనే ప్రాంతానికి చెందిన జాలి కుమార్కు రుచిక(28)అనే యువతితో 2021 డిసెంబర్ 13న వివాహం జరిగింది. అందరిలాగానే ఈ కొత్త దంపతులు కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. హనీమూన్ వెళ్లాలనే ఉద్దేశంతో జనవరి7న రాజస్థాన్లోని మౌంట్అబూకు బయలుదేరారు. అక్కడి హోటల్లో ఓ గది తీసుకుని బస చేశారు. స్థానికంగా ఉన్న ప్రదేశాలన్నింటినీ చూశారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో గానీ జనవరి 10వ తేదీన రుచిక ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించింది. ‘‘మీ కూతురికి అస్వస్థతగా ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాను.. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది’’.. అంటూ రుచిక తల్లిదండ్రులకు జాలీ ఫోన్ చేశాడు. వారంతా కంగారుపడి మౌంట్అబూ చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం రుచిక మృతదేహాన్ని వారికి అప్పగించారు.
పురావస్తు తవ్వకాల్లో ఆశ్చర్యకర పరిణామం.. ఒక్కోటి 40 కిలోల వరకు బరువున్న గుండ్రటి... ఇంతకీ, అవేంటంటే..
అయితే ఇటీవల ఆమె పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. రుచిక నోట్లో నులిపేసిన ఆకులతో పాటూ గొంతుపై తీగతో బిగించిన ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. అలాగే చేతితో గొంతి నులిమి, దిండుతో అదిమి చంపినట్లు ఆధారాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అంతకు ముందే, అల్లుడిపై తమకు అనుమానం ఉందని రుచిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయి నెల కూడా కాకుండానే రుచిక ఇలా శవమై కనిపించడం.. స్థానికులందరినీ కలచివేసింది.