Mother Tongue : మాతృభాషలో విద్యపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-11-30T19:11:03+05:30 IST

సాంకేతిక, వైద్య, న్యాయ శాస్త్ర విద్యా బోధన హిందీ లేదా ప్రాంతీయ భాషల్లో జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు

Mother Tongue : మాతృభాషలో విద్యపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
Amit Shah

న్యూఢిల్లీ : సాంకేతిక, వైద్య, న్యాయ శాస్త్ర విద్యా బోధన హిందీ లేదా ప్రాంతీయ భాషల్లో జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పిలుపునిచ్చారు. దీనివల్ల ఆంగ్లం మాట్లాడలేని విద్యార్థుల ప్రతిభాపాటవాలను దేశం ఉపయోగించుకోవడం సాధ్యపడుతుందని చెప్పారు. విద్యార్థులు తమ మాతృభాష (Mother Tongue)లో చదువుకుంటే, మౌలిక ఆలోచనా ప్రక్రియను సులభంగా అభివృద్ధి చేసుకోగలుగుతారని, ఇది పరిశోధన, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని తెలిపారు.

అమిత్ షా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, టెక్నికల్, మెడికల్, న్యాయ శాస్త్ర విద్యను హిందీ, ప్రాంతీయ భాషల్లో బోధించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వీటిని హిందీలో కానీ, ప్రాంతీయ భాషల్లో కానీ బోధించాలన్నారు. ఈ మూడు రంగాల్లోని పాఠాలను ప్రాంతీయ భాషల్లోకి సరైనవిధంగా అనువదించడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు.

మాతృభాషలో విద్యాభ్యాసం సులువు అని తెలిపారు. దేశంలోని ప్రతిభావంతులు ఉన్నత విద్యలో చేరేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పారు. నేడు మన దేశంలోని ఐదు శాతం ప్రతిభను మాత్రమే ఉపయోగించుకోఃగలుగుతున్నామని, హిందీ (Hindi) లేదా ప్రాంతీయ భాష (Regional Languages)ల్లో విద్యా బోధన జరిగితే, నూటికి నూరు శాతం ప్రతిభను ఉపయోగించుకోవచ్చునని చెప్పారు. ఈ ఐదు శాతం వ్యక్తులు ఆంగ్ల నేపథ్యంగలవారన్నారు. అయితే ఓ భాషగా ఆంగ్లానికి తాను వ్యతిరేకం కాదన్నారు. విద్యార్థి మౌలిక ఆలోచన తన మాతృభాషలో సులువుగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మౌలిక ఆలోచనకు, పరిశోధనకు బలమైన సంబంధం ఉందని తెలిపారు.

చరిత్రకారులు సరైన గుర్తింపు ఇవ్వని ప్రజా నాయకుల గురించి అధ్యయనం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కనీసం 300 మంది ప్రజా నాయకుల గురించి తెలుసుకోవాలన్నారు. అత్యద్భుతంగా పరిపాలించిన మహారాజుల గురించి కూడా తెలుసుకోవాలని చెప్పారు. కనీసం 30 సామ్రాజ్యాల గురించి అధ్యయనం చేయాలన్నారు. మన దేశ నిజమైన చరిత్రను తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైందని చెప్పారు. మన చరిత్ర వక్రీకరణ గురించి ఇంకా ఎంత కాలం గగ్గోలు పెడతామని ప్రశ్నించారు. మన యథార్థ చరిత్ర గురించి పరిశోధన చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

దేశం కోసం అనేక విధాలుగా సేవలందించినప్పటికీ, చరిత్ర పుస్తకాల్లో కనిపించని మహనీయులను స్మరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2022-11-30T19:11:08+05:30 IST