AP News: జగన్ సభకు ఎందుకు రాలేదు రా.. అంటూ వైసీపీ నేత బూతు పురాణం..

ABN , First Publish Date - 2023-04-28T16:18:05+05:30 IST

‘‘సీఎం జగన్ (CM Jagan) నార్పలకు వస్తున్నారు.. వాహనం ఏర్పాటు చేశాం.. నువ్వేమో రాకుండా ఊర్లో తిరుగుతున్నావ్.. సీఎం సభకు రాకుంటే ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న సంక్షేమ పథకాల సొమ్ము చెప్పుతో కొట్టి వసూలు చేస్తా..’’

AP News: జగన్ సభకు ఎందుకు రాలేదు రా.. అంటూ వైసీపీ నేత బూతు పురాణం..

అనంతపురం జిల్లా: ‘‘సీఎం జగన్ (CM Jagan) నార్పలకు వస్తున్నారు.. వాహనం ఏర్పాటు చేశాం.. నువ్వేమో రాకుండా ఊర్లో తిరుగుతున్నావ్.. సీఎం సభకు రాకుంటే ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న సంక్షేమ పథకాల సొమ్ము చెప్పుతో కొట్టి వసూలు చేస్తా..’’ అంటూ సత్యసాయి జిల్లా, ధర్మవరం వైసీపీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి.. రావుల చెరువు గ్రామానికి చెందిన వెంకటరాముడుని ఫోన్‌లో బెదిరించారు. తనకు ఇల్లు లేదని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేయలేదని ఫోన్ చేసిన ప్రతాప్ రెడ్డికి వెంకటరాముడు తెలిపాడు. ఇల్లు లేకపోవడంతో షెడ్ వేసుకుని అందులో నివసిస్తున్నామని అన్నాడు. ఈ ప్రభుత్వంలో తనకు ఏ సాయం అందలేదని, సీఎం సభకు ఎందుకు రావాలని అని ప్రశ్నించాడు.

వెంకటరాముడు మాటలతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రతాప్ రెడ్డి బూతు పురాణాన్ని అందుకున్నారు. ‘వైఎస్సార్ చేనేత పథకం కింద లబ్దిపొందేలా సాయం చేయలేదా? ఇంకే చేయాలి నీకు.. భూములు రాసివ్వాలా?’ అంటూ మండిపడ్డారు. నార్పల సభకు రాకుంటే ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా అందుకున్న డబ్బులను చెప్పుతో కొట్టి మరీ వసూలు చేస్తానని.. ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టారు. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వీడియో ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఓ సామాన్యుడిపై అధికార మదం ప్రదర్శిస్తారా? అంటూ ప్రజలు, ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం సభకు రాకపోతే బెదింపులకు దిగుతారా? అంటూ నిలదీస్తున్నారు.

Updated Date - 2023-04-28T16:18:05+05:30 IST