Chandrababu bail live updates: బాబు బెయిల్‌పై స్పందించిన పవన్ కళ్యాణ్.. పురందేశ్వరి ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-10-31T11:12:55+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

Chandrababu bail live updates: బాబు బెయిల్‌పై స్పందించిన పవన్ కళ్యాణ్.. పురందేశ్వరి ఏమన్నారంటే..

Live News & Update

  • 2023-10-31T14:00:00+05:30

    బాబు బెయిల్‌పై పవన్ రియాక్షన్ ఏంటంటే..

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రబాబు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని అన్నారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా పవన్ స్పందించారు. ‘‘చంద్రబాబుకి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో.. ఉత్సాహంతో ప్రజాసేవకు పునర్ అంకితం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని, చంద్రబాబు బెయిల్‌పై రావడాన్ని అందరం స్వాగతిద్దామని అన్నారు.

  • 2023-10-31T13:21:00+05:30

    రాజమండ్రికి అచ్చెం నాయుడు, ఇతర నేతలు

    బెయిల్‌పై విడుదల కానున్న చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు, నేతలు ఏలూరి సాంబశివరావు, అనగని సత్య ప్రసాద్ రాజమండ్రి వెళ్తున్నారు. ప్రతి జిల్లా నుంచి తెలుగుదేశం నేతలు రాజమహేంద్రవరం బయలుదేరుతున్నారు. మంగళవారం సాయంత్రం చంద్రబాబు బయటకు వస్తారని భావిస్తున్న నేపథ్యంలో వారంతా అక్కడికి చేరుకుంటున్నారు. కాగా చంద్రబాబు భారీ ర్యాలీతో చంద్రబాబు అమరావతి చేరుకోనున్నారు.

  • 2023-10-31T13:03:00+05:30

    బెయిల్‌ రావడం మంచిదే: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర బెయిల్‌పై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు. ఈ మేరకు మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము తప్పు పట్టబోమన్నారు. నోటీసులివ్వకుండా.. విచారణ చేపట్టకుండా అరెస్ట్ చేసిన విధానాన్ని తాము గతంలోనే తప్పు పట్టామని ప్రస్తావించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండానే అరెస్ట్ చేసిన విధానం కూడా కరెక్ట్ కాదన్నారు. మధ్యంతరం బెయిల్ రావడం మంచిదేనని పురందేశ్వరి పేర్కొన్నారు.

    Untitled-7.jpg

  • 2023-10-31T12:34:00+05:30

    ఏసీబీ కోర్టుకు చేరిన దేవినేని ఉమ, బోండా ఉమమహేశ్వరరావు

    చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పిటిషన్‌కు సంబంధించి షూరిటీలు పెట్టేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. బెయిల్ పిటిషన్ ష్యూరిటి పేపర్స్‌ను చంద్రబాబు నాయుడి న్యాయవాదులు సిద్ధం చేస్తున్నారు.

  • 2023-10-31T12:03:00+05:30

    articleTextచంద్రబాబు బెయిల్‌కు హైకోర్టు విధించిన 5 షరతులు ఇవే..

    1. పిటిషనర్ చంద్రబాబు రూ.1 లక్ష పూచీకత్తుతో 2 షూరిటీలు ట్రయల్ కోర్టుకు సమర్పించాలి.

    2. పిటిషనర్ చంద్రబాబు ఆయనే సొంతంగా పరీక్షలు చేయించుకొని/చికిత్స తీసుకోవాలి. హాస్పిటల్ ఎంపిక ఆయన సొంత నిర్ణయం. ఖర్చు ఆయనే పెట్టుకోవాలి.

    3. తాను తీసుకున్న చికిత్సకు సంబంధించిన వివరాలను పిటిషనర్ కోర్టుకు తెలియజేయాలి. ఏ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌కి సీల్డ్ కవర్‌ ద్వారా ఈ సమాచారం అందించాలి. ఈ సీల్డ్ కవర్‌ను అధికారి ట్రయల్‌కు పంపించాలి.

    4. పిటిషనర్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కేసుతో సంబంధమున్న ఏ వ్యక్తినీ ప్రలోభపెట్టడం, బెదిరింపులు లేదా హామీలు ఇవ్వడం లాంటివి చేయకూడదు. కోర్టు లేదా మరేదైనా సంస్థకు సంబంధించిన వివరాలు చెప్పాలని కోరకూడదు.

    5. నవంబర్ 28, 2023న సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైలులో తనంతట తానే సరెండర్ కావాలి.

    Untitled-5.jpg

  • 2023-10-31T11:43:00+05:30

    చాలా సంతోషంగా ఉంది: మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్

    చంద్రబాబు నాయుడికి మధ్యంత బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. కొన్ని అనుమానాలు వస్తున్నాయని, మళ్లీ ఏదో ఒక కేసులో బాబును అరెస్టు చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. 49 సంవత్సరాలుగా తనకు తెలిసిన మిత్రుడు బయటికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. సూరత్ కేసులో రాహుల్ గాంధీని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో.. బాబును కూడా అలాగే ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.

  • 2023-10-31T11:26:00+05:30

    Untitled-3.jpg

    యుద్ధం ఇప్పుడు ఆరంభం అయ్యింది: నారా లోకేష్

    టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి రాజమండ్రి చేరుకున్నారు. చంద్రబాబుకి బెయిల్ వచ్చిన విషయాన్ని నాయకులు లోకేష్ వద్ద ప్రస్తావించారు. బెయిల్‌పై స్పందిస్తూ.. ‘యుద్ధం ఇప్పుడు ఆరంభం అయ్యింది’ అని నాయకులు, కార్యకర్తలతో అన్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ లభించడంతో టీటీడీపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ వద్ద సంబురాలకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

  • 2023-10-31T11:19:00+05:30

    • రాజమండ్రి నుంచి నేరుగా విజయవాడకు వెళ్లి అక్కడి నుంచి తిరుపతి వెళ్లనున్న చంద్రబాబు.

    • తిరుపతిలో దర్శనం అనంతరం హైదరాబాద్‌కు వెళ్లి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందనున్న టీడీపీ అధినేత

  • 2023-10-31T11:08:00+05:30

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నాలుగు వారాలపాటు నవంబర్ 24 వరకు అనుమతిచ్చింది. రూ.1 లక్ష పూచీకత్తు, 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బెయిల్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న చంద్రబాబు, టీడీపీ అభిమానులకు కోర్టు తీర్పు సంతోషాన్ని కలిగించింది.

    చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 10న ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం 10న అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాబును తరలించారు. గత 53 రోజులుగా టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు.