Share News

Kakinada: గోదావరిలో గల్లంతైన నలుగురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం

ABN , First Publish Date - 2023-10-22T10:42:34+05:30 IST

కాకినాడ: గోదావరిలో గల్లంతైన నలుగురు యువకుల్లో ఇద్దరి మృతదేహాల ఆచూకీ లభ్యమైంది. నదిలో మునిగిపోయిన సమీపంలోనే మృతదేహాలను గుర్తించారు. మృతులు ముద్దన పనింద్ర గణేష్ (21), పెండ్యాల బాలాజీ (21)గా గుర్తించారు. మిగిలిన మరో ఇద్దరి ఆచూకీ కోసం..

Kakinada: గోదావరిలో గల్లంతైన  నలుగురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం

కాకినాడ: గోదావరిలో గల్లంతైన నలుగురు యువకుల్లో ఇద్దరి మృతదేహాల ఆచూకీ లభ్యమైంది. నదిలో మునిగిపోయిన సమీపంలోనే మృతదేహాలను గుర్తించారు. మృతులు ముద్దన పనింద్ర గణేష్ (21), పెండ్యాల బాలాజీ (21)గా గుర్తించారు. మిగిలిన మరో ఇద్దరి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు మూడు బోట్లలో గాలిస్తున్నారు. నిన్న విహార యాత్రకోసం యానం వచ్చి గోదావరిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. వారంతా పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు.

పూర్తి వివరాలు...

వారంతా యువకులు.. వారిలో కొందరు విద్యార్థులు.. మరికొందరు చిరుద్యోగులు.. తణుకు ప్రాంతానికి చెందిన వాళ్లు మొత్తం ఏడుగురు స్నేహితులు.. ఎక్కడికైనా సరాదాగా విహారయాత్రలకు వెళ్లి రావడం వీరి హాబీ.. అలా దసరా సెలవులు కావడంతో శనివారం సరదాగా సేదతీరేందుకు యానాం వెళ్లాలనుకున్నారు. అలా మూడు మోటారుసైకిళ్లపై అక్కడకు వెళ్లారు. అక్కడినుంచి తాళ్లరేవు మండలంలోని గోపిలంక పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. భోజనం చేసి సరదాగా కాసేపు స్నానం చేసి సేదతీరుదామనుకున్నారు. కానీ, ఇంతలోనే ఊహించని పరిణామం జరిగింది. వారిలో ఒక యువకుడు అకస్మాత్తుగా పరిగెట్టుకుంటూ వెళ్లి గోదావరిలోకి దూకాడు. అతడ్ని కాపాడేందుకు వెళ్లి మరో ముగ్గురు.. ఇలా మొత్తం నలుగురు యువకులు మునిగి పోయారు. మిగిలిన స్నేహితుల్లో ఇద్దరు నిస్సహాయులుగా మిగలగా మరొక స్నేహితుడు ఆ సంఘటనను చూసి భయంతో అక్కడినుంచి పారిపోయాడు. ఇలా వీరి విహారయాత్ర విషాదయాత్రగా మారింది.

వారంతా మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణం సజ్జాపురం పార్కువీధికి చెందిన హనుమకొండ కార్తీక్‌, మద్దిని ఫణీంద్రగణేష్‌, పెండ్యాల బాలాజీ, తిరుమలరావు రవితేజ, నేదునూరి భానుప్రసాద్‌, సలాది దుర్గామహేష్‌, కొమ్మిరెడ్డి చైతన్య స్నేహితులు. ఈ ఏడుగురు యువకులు విహార యాత్రలకు కలిసి వెళ్తుంటారు. ఈ క్రమంలో దసరా సెలవులు కావడంతో సరదాగా మూడు మోటారుసైకిళ్లపై యానాం వచ్చారు. శనివారం ఉదయం 10గంటలకు యానాం చేరుకుని అక్కడ కాసేపు గడిపారు. అక్కడినుంచి తాళ్లరేవు మండలంలోని గోపిలంక పుష్కరఘాట్‌కి ఒంటి గంట సమయానికి చేరుకున్నారు. గోదావరి ఒడ్డున స్నేహితులంతా కలిసి సరదాగా పార్టీ చేసుకుంటున్నారు. ఇంతలో వీరిలో ఒకరు పరుగెత్తుకుని వెళ్లి అకస్మాత్తుగా గోదావరిలోకి స్నానం చేయడం కోసం దూకాడు. అతడు లోతు తెలియకపోవడంతో మునిగిపోతూ హాహాకారాలు చేశాడు. ఇది గమనించిన ముగ్గురు స్నేహితులు అతడిని కాపాడేందుకు గోదావరిలోకి దూకి వారు కూడా గల్లంతయ్యారు. అలా హనుమకొండ కార్తీక్‌(21), మద్దిని ఫణీంద్రగణేష్‌(21), పెండ్యాల బాలాజీ(21), తిరుమలరావు రవితేజ(21) గోదావరిలో మునిగిపోయారు. ఈ సంఘటన చూసి భయపడి నేదునూరి భానుప్రసాద్‌ అనే యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. మరో ఇద్దరు స్నేహితులు సలాది దుర్గామహేష్‌, కొమ్మిరెడ్డి చైతన్య తమ స్నేహితులను రక్షించే ప్రయత్నం చేసినా గల్లంతైన యువకులను కాపాడలేకపోయారు. ఎంత ప్రయత్నించినా తమ స్నేహితులను రక్షించలేకపోయారు. ఎవరైనా కాపాడాలని గట్టిగా అరిచారు. ఎన్ని హాహాకారాలు చేసినా అక్కడ సాయం చేసేవాళ్లెవరూ లేకపోయారు.

అనంతరం వారు తమ కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి తమ నలుగురు స్నేహితులు గోదావరిలో మునిగిపోయారని సమాచారం ఇచ్చారు. వారు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ద్వారా కోనసీమ జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందింది. ఆయన తాళ్లరేవు తహసీల్దార్‌ ఎస్‌. పోతురాజుకు ఫోన్‌ చేసి సమాచారం తెలిపారు. వెంటనే అధికారులు అప్రమత్తమై గోపిలంక పుష్కరఘాట్‌ వద్దకు చేరుకున్నారు. గల్లంతైన యువకుల కోసం గజ ఈతగాళ్లతో బోటులో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎవరూ లభ్యం కాలేదు. తాళ్లరేవు తహసీల్దార్‌ ఎస్‌.పోతురాజు, కోరింగ ఎస్‌ఐ ఎస్‌.రవికుమార్‌ గాలింపు చర్యలను పర్యవేక్షించారు. గల్లంతైన నలుగురికోసం బోటుతో గాలింపు చర్యలు చేస్తున్నామని, వారి వివరాలను సేకరించి కలెక్టర్‌కు తెలియజేశామని తహసీల్దార్‌ పోతురాజు తెలిపారు. యువకుల కోసం గాలింపు చర్యలు చేస్తున్నామని కోరింగ ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

Updated Date - 2023-10-22T10:42:34+05:30 IST