Pawan Kalyan: వైసీపీ అక్రమాలపై ప్రజాకోర్టు

ABN , First Publish Date - 2023-08-16T02:28:33+05:30 IST

‘‘వచ్చే ఎన్నికల్లో జగన్‌ రాకపోతే పథకాలు ఆగిపోతాయేమో.. సంక్షేమం నిలిచిపోతుందేమో... అనుకోవద్దు. ఇంతకంటే అద్భుతమైన సంక్షేమ పథకాలుంటాయి తప్ప ఏ పథకమూ ఆగిపోదు. జాతి నాయకుల పేర్లతో సరికొత్త పథకాలు అమలు చేస్తాం’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.

Pawan Kalyan: వైసీపీ అక్రమాలపై ప్రజాకోర్టు

ఆ పార్టీ నేతల దోపిడీని ప్రజల ముందు ఉంచుతాం

పథకాలేవీ ఆగవు.. కొత్త పథకాలూ వస్తాయి

మహిళల రక్షణే జనసేన తొలి ప్రాధాన్యత

ఎక్కడికెళ్లినా జగన్‌ వంటి వ్యక్తులు ఉంటారు

పారిపోనక్కర్లేదు.. పోరాడి తరిమికొట్టాలి

అవినీతిపై సమాచారమిస్తే ప్రోత్సాహకాలు

వీర మహిళలతో సమావేశంలో పవన్‌

వైసీపీ అక్రమాలపై ప్రజాకోర్టు

ఆ పార్టీ నేతల దోపిడీని ప్రజల ముందు ఉంచుతాం

పథకాలేవీ ఆగవు.. కొత్త పథకాలూ వస్తాయి

మహిళల రక్షణే జనసేన తొలి ప్రాధాన్యత: పవన్‌

అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ‘‘వచ్చే ఎన్నికల్లో జగన్‌ రాకపోతే పథకాలు ఆగిపోతాయేమో.. సంక్షేమం నిలిచిపోతుందేమో... అనుకోవద్దు. ఇంతకంటే అద్భుతమైన సంక్షేమ పథకాలుంటాయి తప్ప ఏ పథకమూ ఆగిపోదు. జాతి నాయకుల పేర్లతో సరికొత్త పథకాలు అమలు చేస్తాం’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని పార్టీకార్యాలయంలో వీర మహిళలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ... విశాఖ పర్యటనలో ఓ 60ఏళ్ల ఒంటరి మహిళ ఓ కాగితం పట్టుకొచ్చి, తన ఇంటికి దిక్కుగా ఉన్న కొడుకుని అన్యాయంగా హత్య చేశారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా, స్పందనలో మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయిందన్నారు. ఓ తల్లి వేదన తీర్చలేని అధికారం ఉన్నా ఒక్కటే... లేకున్నా ఒక్కటేనని అప్పుడు తనకు అనిపించిదని చెప్పారు. ‘‘వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్‌ గెలిస్తే ఇక్కడ ఉండలేం.. పారిపోతామని నాకు చెప్పుకొని బాధపడేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు.. ఇలా భిన్నవర్గాల వారు జగన్‌ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, బతకడానికి భయపడే పరిస్థితులు వస్తాయని మధనపడుతన్నారు.

అందరికీ నేను చెప్పేదొక్కటే. ఎక్కడికెళ్లినా జగన్‌ వంటి వ్యక్తులు, అతడి కంటే క్రూరమైన వారు కనిపిస్తూనే ఉంటారు. ఈ నేలను విడిచి పారిపోవాల్సిన అవసరం లేదు. సమష్టిగా పోరాడి వచ్చే ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధంతో జగన్‌ వంటి వ్యక్తులను తరిమికొడదాం. సీఎం జగన్‌ నివాసముండే తాడేపల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిదిలోనే నేరాల రేటు ఎక్కువగా ఉంది. మహిళలకు న్యాయం చేయలేని, వారిని గౌరవించలేని మనసుతో మీరు ఎన్ని చట్టాలు చేసినా వృథానే. శాంతిభద్రతల రక్షణకు జనసేన తొలి ప్రాధాన్యం ఇస్తుంది. మహిళల భద్రత కోసం ప్రత్యేక వ్యవస్థలు పనిచేసేలా చేస్తాం’’ అని పవన్‌ హామీ ఇచ్చారు. ‘‘ప్రజలపై లేని పన్నులు, వడ్డింపులు చేస్తున్న ప్రభుత్వం ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేసింది. రాష్ట్రంలో రౌడీయిజం చేసేవారిపై పన్నులు వేస్తే, ప్రజలను పీడిస్తూ రౌడీయిజం, గుండాగిరిని నమ్ముకున్న వైసీపీ నాయకులు చెల్లించే పన్నులతోనే ప్రభుత్వ ఖజానా నిండిపోతుంది. ప్రభుత్వ రెవెన్యూ లోటు తీరిపోతుంది. క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకుల దాష్టీకాలను, దుర్మార్గాలను చూసి ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం ఉంది. అది వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ నాయకులను నామరూపల్లేకుండా చేస్తుంది. క్షేత్రస్థాయిలో జరిగే అక్రమాలు, అవినీతిని బయటపెట్టే వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సహకం అందించేలా ఏర్పాటు చేస్తాం. పార్టీలతో, వర్గాలతో సంబంధం లేకుండా ప్రజల ఆస్తులను దోపిడీ చేసేవారికి కచ్చితంగా జనసేన ప్రభుత్వంలో తగిన శిక్షలు ఉంటాయి’’ అని హెచ్చరించారు.

9janasena.jpg

ప్రజాకోర్టులు నిర్వహిస్తాం..

‘‘ప్రజాస్వామ్య దేశంలో బలమైన చట్టాలు, న్యాయ వ్యవస్థ ఉన్నప్పటికీ నేటి పరిస్థితుల్లో ప్రతి చిన్న అంశానికీ సామాన్యుడు కోర్టుల చుట్టూ తిరగలేని పరిస్థితి ఉంది. వైసీపీ నాయకుల అక్రమాలు, దోపిడీలపై జనసేన ప్రజాకోర్టు నిర్వహిస్తుంది. క్షేత్రస్థాయిలో తప్పులకు న్యాయస్థానాలైతే ఎలాంటి శిక్షలు వేస్తాయి...? వైసీపీ నేతల తప్పులకు న్యాయపరంగా ఎలా స్పందించాలి అనే విషయాలను ప్రజాకోర్టులో ఉంచుతాం. వారు చేస్తున్న తప్పులు రాజ్యాంగానికి ఎంత విరుద్ధమైనవో తెలియజేస్తాం. రాజ్యాంగం చెప్పిన ఏ అంశాన్నీ జగన్‌ పట్టించుకోవడం లేదు. ఆర్థిక అవకతవకలు చేసి 38 కేసుల్లో 16నెలలు జైలులో ఉన్న వ్యక్తి రాజ్యాంగ పరిరక్షణ చేసే న్యాయస్థానాలపై నిందలు వేసే స్థాయికి వెళ్లారు. లేదు. పర్యావరణాన్ని కాపాడాల్సిన పెద్ద మనిషి విధ్వంసం చేస్తున్నాడు. మోసపూరితమైన మాటలు నమ్మి ఒక వ్యక్తికి ఓటు వేస్తే, ఐదేళ్లు విలువైన కాలం ఏమైపోయిందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మన కోసం నిలబడతాడా లేదా అని ఆలోచించిన తర్వాతే మీ మద్దతు ఇవ్వాలి’’ అని జనసేనాని సూచించారు. కార్యక్రమంలో పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-16T04:33:56+05:30 IST