YCP: గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేకు షాక్

ABN , First Publish Date - 2023-04-04T11:59:58+05:30 IST

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు పెద్ద షాక్ తగిలింది.

YCP: గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేకు షాక్

కృష్ణా: మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ (YCP MLA Vasanta Krishna Prasad)కు పెద్ద షాక్ తగిలింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దేవుని చెరువులో పాల్గొన్న ఎమ్మెల్యేను స్థానికులు.. తాము ఎదుర్కుంటున్న సమస్యలపై నిలదీశారు. జనాలకు డబ్బులు ఇస్తున్నారు కానీ అభివృద్ధి కనిపించడం లేదని స్థానికులు మండిపడ్డారు. వారికి సర్దిచెప్పేందుకు కృష్ణప్రసాద్ ప్రయత్నించారు. తాను ఎమ్మెల్యే అయ్యాకే రూ.3 కోట్లతో డ్రైనేజీలు, రోడ్లు వేయించానని.. ఒక్కసారే అభివృద్ది జరిగిపోదని కొంచెం కొంచెం చేసుకుంటూ వస్తున్నామని చెప్పారు. అయినా కోపం చల్లారని దేవుని చెరువు వాసులు డ్రైనేజీ సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఏళ్ల తరబడి అద్దెకు ఉంటున్నా ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని మహిళలు వాపోయారు.

తన కూతురు వికలాంగురాలని, తన భర్త చనిపోయిన ఇంట్లో ఎవరికీ పెన్షన్ రావడం లేదన్న బెజవాడ వెంకటేశ్వరమ్మ అనే మహిళ ఎమ్మెల్యేకు విన్నవించుకుంది. సొంత పార్టీ కార్యకర్త అయి ఉండి ఆ పార్టీ నేతలతో గొడవకు దిగాడు. వేరే ఇంట్లో అద్దెకు ఉంటున్నా ఇళ్ల స్థలం మంజూరు చేయడం లేదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో గొడవకు దిగాడు. డ్రైనేజీ సరిగా లేకపోవడంతో మురుగు నీరు పోక దోమలతో నరకం అనుభవిస్తున్నామని వృద్దురాలు వాపోయింది. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడే వైసీపీ నేతలు వస్తున్నారని... నాలుగేళ్లు మళ్ళీ కంటికి కనిపించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-04T11:59:58+05:30 IST