AP High Court: కృష్ణబాబు, ద్వారకా తిరమలరావుకు జైలు శిక్ష

ABN , First Publish Date - 2023-05-04T20:43:00+05:30 IST

సీనియర్ ఐఏఎస్ కృష్ణ బాబు (IAS Krishna Babu), ఐపీఎస్ ద్వారకా తిరుమలరావుకు నెల రోజులు జైలు శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ హైకోర్టు (High Court) తీర్పు చెప్పింది.

AP High Court:  కృష్ణబాబు, ద్వారకా తిరమలరావుకు జైలు శిక్ష

అమరావతి: సీనియర్ ఐఏఎస్ కృష్ణ బాబు (IAS Krishna Babu), ఐపీఎస్ ద్వారకా తిరుమలరావుకు నెల రోజులు జైలు శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ హైకోర్టు (High Court) తీర్పు చెప్పింది. 16లోగా రిజిస్ట్రార్ జ్యుడీషియల్ (Registrar Judicial) ముందు లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది. వెంటనే జైలుకు పంపాలని రిజిస్ట్రార్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వుల అమలు బాధ్యత ఉన్నతాధికారులదేనని, ఉత్తర్వుల అమల్లో ఇబ్బందులు ఉంటే కోర్టుకు తెలిపి.. గడువు పొడిగించాలంటూ అభ్యర్థించాలని పేర్కొంది. వీరితో పాటు మరో ముగ్గురు ఆర్టీసీ అధికారులకు కూడా ఏపీ హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ఆదేశాలను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని మండిపడింది. ఆర్టీసీలో ఫీల్డ్‌మెన్‌గా పనిచేస్తున్న చిత్తూరు (Chittoor)కు చెందిన బి.సురేంద్ర, మరో ముగ్గురు తమ సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం... ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, వారి జీతాలకు 7% వడ్డీ కలిపి పిటిషనర్లకు చెల్లించాలంటూ 2022 ఆగస్టులో ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు అమలుకాకపోవడంతో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. అప్పీల్ పెండింగ్‌లో ఉందంటూ ఆర్టీసీ లాయర్లు వాదించారు. అప్పీల్‌పై డివిజినల్ బెంచ్ స్టే విధించలేదని హైకోర్టు గుర్తుచేసింది. అందుకే అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల వందల కోర్టు ధిక్కరణ కేసులు పడుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సివిల్ సర్వీస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. సీనియర్ ఐఏఎస్‌లే కాకుండా సీఎస్, డీజీపీలు కూడా చాలా సార్లు హైకోర్టుకు హాజరయిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-05-04T20:57:31+05:30 IST