Nara Lokesh: స్కిల్ కేసులో నారా లోకేష్‌కు ముందస్తు బెయిల్.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా...

ABN , First Publish Date - 2023-09-29T15:12:03+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఊరట దక్కింది. ఏపీ హైకోర్ట్ ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Nara Lokesh: స్కిల్ కేసులో నారా లోకేష్‌కు ముందస్తు బెయిల్.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా...

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఊరట దక్కింది. ఏపీ హైకోర్ట్ ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 4వరకు లోకేష్‌ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్ట్ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఉదయమే బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా పరిశీలించిన అనంతరం హైకోర్ట్ ఈ ఆదేశాలిచ్చింది. కాగా ఈ కేసులో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే.


చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా...

మరోవైపు.. మరోవైపు ఫైబర్ గ్రిడ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణను అక్టోబర్ 4 వరకు వాయిదా వేస్తున్నట్టు హైకోర్ట్ వెల్లడించింది. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు పేరు ఉందని ఆయన లాయర్లు చెబుతున్నారని, తాము దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలను తీసుకోవాల్సి ఉంటుందని, అందుకే తమకు వాయిదా కావాలని సీఐడీ తరపున లాయర్లు చెప్పడంతో విచారణను కోర్ట్ వాయిదా వేసింది. కాగా చంద్రబాబుపై సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన నేపథ్యంలోనే చంద్రబాబు లాయర్లు ముందస్తు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.


స్కిల్ అక్రమ కేసులో లోకేష్ పేరు ఉందా లేదా??

ఇదిలావుండగా... స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో నారా లోకేష్ పేరు ఉందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. లోకేష్ పేరు లేదని చెబుతున్నప్పటికీ.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత సీఐడీ చీఫ్ సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన నిధులు లోకేష్‌కు వచ్చాయని అన్నారు. అయితే లోకేష్‌కి ఈ శాఖతో ఎలాంటి సంబంధం లేదు. లోకేష్ పంచాయతీరాజ్, ఐటీ శాఖలు నిర్వహించారు. అయితే కిలారు రాజేష్ ద్వారా వచ్చాయని సీఐడీ చెబుతోంది. అయితే అంతకుముందు కిలారు రాజేష్ ఇంటి దగ్గర ఐటీ అధికారులు తనిఖీలు చేసి ఎటువంటి ఆధారాలు దొరకకు ఆ కేసును మూసేశారు. కానీ కిలార్ రాజేష్ షెల్ కంపెనీల ద్వారా నారా లోకేష్‌కు డబ్బులు వచ్చాయని సీఐడీ చెబుతోంది. దర్యాప్తు చేస్తున్నామని, ఆధారాలు లభిస్తే అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇదే పాటపాడడంతో ముందస్తు బెయిల్ కావాలంటూ లోకేష్ తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం లంచ్ మోషన్ దాఖలు చేశారు.

Updated Date - 2023-09-29T16:15:20+05:30 IST