Income Tax Department: ఎక్సైజ్‌, విద్యుత్‌ శాఖ మంత్రిపై ఐటీ పంజా

ABN , First Publish Date - 2023-05-27T10:49:38+05:30 IST

రాష్ట్ర ఎక్సైజ్‌, విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ(Minister Senthil Balaji)పై ఐటీ పంజా విసిరింది. ఆయన సోదరుడు అశోక్‌కుమార్‌, బం

Income Tax Department: ఎక్సైజ్‌, విద్యుత్‌ శాఖ మంత్రిపై ఐటీ పంజా

- కుటుంబీకులు, అనుచరుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు

- 3 జిల్లాల్లో 40 చోట్ల సోదాలు

- కరూరులో ఐటీ అధికారుల వాహనాలపై మంత్రి అనుచరుల దాడి

- పోలీసులను ఆశ్రయించిన ఐటీ అధికారులు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎక్సైజ్‌, విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ(Minister Senthil Balaji)పై ఐటీ పంజా విసిరింది. ఆయన సోదరుడు అశోక్‌కుమార్‌, బంధువులు, ఆ రెండు శాఖల్లో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నివాస గృహాలు, కార్యాలయాల్లో ఆదాయపు పన్నుల శాఖ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. కరూరు, ఈరోడ్‌, కోయంబత్తూరు జిల్లాల్లోని 40 చోట్ల వేకువ జామునుంచి తనిఖీలు ప్రారంభమయ్యాయి. కరూరు(Karur)లో మంత్రి అనుచరులు, బంధువుల గృహాలో తనిఖీ చేసేందుకు వెళ్ళిన ఐటీ అధికారులతో డీఎంకే(DMK) స్థానిక నాయకులు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఓ అధికారికి చెందిన కారు అద్దాలను ధ్వసం చేశారు. ఈ ఘటనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఐటీ అధికారులు తనిఖీలను నిలిపివేసి పోలీసుస్టేషన్‌లో ఆశ్రయం పొందారు. ఈ తనిఖీలు జరుగుతున్న సమయంలో మంత్రి సెంథిల్‌బాలాజి నగరంలోనే ఉన్నారు. సచివాలయంలో రోజువారీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆదాయపు పన్నుల శాఖ అధికారులు కరూరు, ఈరోడ్‌, కోయంబత్తూరు జిల్లాల్లో ఈ దాడులు ఒకే సమయంలో నిర్వహించారు. కేరళలోని పాలక్కాడు, బెంగళూరు, హైదరాబాద్‌(Bangalore, Hyderabad) నగరాల్లో మంత్రి సెంథిల్‌బాలాజి అనుచరుల నివాస గృహాలు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరిగాయి. రాష్ట్రంలోని టాస్మాక్‌, విద్యుత్‌ శాఖలకు సంబంధించిన టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నివాస గృహాలు, కార్యాలయాలపైనే ఐటీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించి ఈ సోదాలు నిర్వహించారు. కోయంబత్తూరులోని గోల్డ్‌వీనస్‌ ప్రాంతంలో డీఎంకే నాయకుడు సెంథిల్‌ కార్తికేయన్‌ గృహంలో తనిఖీలు జరిపారు. కార్తికేయన్‌ ఇటీవలే అన్నాడీఎంకే నుంచి డీఎంకేలో చేరారు. రెండు కార్లలో పదిమందికిపైగా ఐటీ అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు జరిపారు. ఈ దాడులు గురించి తెలుసుకున్న డీఎంకే కార్యకర్తలు ఆ ప్రాంతానికి తరలివెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఐటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే విధంగా కల్లపట్టి సాయిబాబా కాలనీ తదితర ప్రాంతాల్లోనూ పలువురి నివాస గృహాలలో దాడులు జరిగాయి. ప్రతిచోటా రెండు కార్లలో పదిమంది చొప్పున అధికారులు వెళ్ళి తనిఖీలు జరిపారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సెంథిల్‌బాలాజి ఉద్యోగాల పేరుతో పలువురిని మోసగించారనే ఆరోపణలపై ప్రస్తుతం ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై బీజేపీ నేతలు గవర్నర్‌ రవిని కలుసుకుని సెంథిల్‌ బాలాజీపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం కూడా సమర్పించారు. ఆ నేపథ్యంలో ఈ దాడులు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. అంతే కాకుండా ముఖ్యమంత్రి స్టాలిన్‌ విదేశీ పర్యటనలో ఉన్నసమయంలో ఐటీ అధికారులు ఒకే సారి 40 చోట్ల దాడులు జరుగటం డీఎంకే వర్గాలలోనూ గుబులు పుట్టించింది. ఈ దాడులు నిర్వహించేందుకు తగు కారణాలను కూడా ఐటీ ఉన్నతాధికారులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

కరూరులో డీఎంకే కార్యకర్తల హల్‌చల్‌...

శుక్రవారం ఉదయం కరూరులోని సెంథిల్‌కార్తికేయన్‌ ఇంట్లో దాడులు జరిపేందుకు వెళ్ళిన ఐటీ అధికారులను డీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈక్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేయడంతో ఓ ఐటీ అధికారి కారు అద్దాలు పగిలాయి. దీంతో ఐటీ అధికారి ఒకరు డీఎంకే కార్యకర్తపై చేయిచేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఐటీ అధికారులు తనిఖీలు ఆపివేసి కరూరు పోలీసుస్టేషన్‌లో ఆశ్రయం పొందారు. ఇదే విధంగా కరూరు రామేశ్వరపట్టిలో మంత్రి సెంథిల్‌బాలాజి తల్లిదండ్రుల ఇల్లు, రామకృష్ణాపురంలోని సోదరుడు అశోక్‌ ఇంట్లో తనిఖీలు జరిగాయి. ఆ ప్రాంతాల్లో కూడా డీఎంకే కార్యకర్తలు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయమై కరూరు డీఎస్పీ సుందరవదనన్‌(DSP Sundaravadanan) మాట్లాడుతూ.. ఐటీ అధికారులు భద్రత కల్పించాలని తమను సంప్రదించలేదన్నారు. అంతేకాకుండా ఐటీ అధికారులు వారి వెంట కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాన్ని వెంటబెట్టుకుని రాలేదని చెప్పారు. డీఎంకే కార్యకర్తలు, ఐటీ అధికారులు దాడులకు పాల్పడ్డారని సమాచారం అందటంతో హుటాహుటిన అక్కడికి వెళ్ళి పరిస్థితిని చక్కదిద్దామని చెప్పారు. ఆ తర్వాత స్థానిక పోలీసుల భద్రతతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఐటీ అధికారులు సోదాలు జరిపారు.

ఐటీ దాడులు కొత్తకాదు

- మంత్రి సెంథిల్‌బాలాజి

nani8.jpgఐటీ దాడులు తనకు కొత్త కాదని, పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని మంత్రి సెంథిల్‌బాలాజి అన్నారు. ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో ఆయన సచివాలయంలో తన శాఖకు సంబంధించి అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన ఇల్లు, కార్యాలయంలో ఐటీ దాడులు జరగలేదని, తన తమ్ముడు, సన్నిహితులు, కాంట్రాక్టర్ల ఇళ్లలోనే సోదాలు జరిగాయన్నారు. ఇలాంటి ఐటీ దాడులు తమకు కొత్త కాదని చెప్పారు. కాగా తన తమ్ముడి ఇంటి వద్ద ఐటీ అధికారులు దురుసగా వ్యవహరించారని, ఇంటి ఇనుపగేటును తెరవడానికి ముందే ఐటీ అధికారులు గేటుపైకి ఎక్కి దూకారన్నారు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో తనకు అందిందని, దాని ఆధారంగా విచారణ జరపాలని ఐటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఐటీ అధికారులు ఎన్ని రోజులపాటు సోదాలు జరిపినా అందుకు పూర్తిగా సహకరిస్తామన్నారు. 2006 నుంచి ఇప్పటివరకూ తానుగానీ, కుటుంబీకులు గానీ ఓ చదరపు అడుగు స్థలం కూడా కొనలేదని, అక్రమార్జనలకు పాల్పడలేదని, తమకున్న ఆస్తులే సరిపోతాయని ఆయన స్పష్టం చేశారు.

కక్షసాధింపే...

మంత్రి సెంథిల్‌ బాలాజి అనుచరులు, కాంట్రాక్టర్ల ఇళ్లలో ఐటీ దాడులు జరగడంపై డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి స్పందిస్తూ రాజకీయ కక్షపాధింపులో భాగంగానే ఈ సోదాలు జరిగాయన్నారు. ప్రతిపక్షాలను అణచివేయడం కోసం ఐటీ దాడులు జరుపటం ఆనవాయితీగా మారిందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఆంజనేయస్వామి పేరు చెప్పి ఆ ఎన్నికల్లో గెలవాలని చేసిన కుటిల ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఈక్రమంలో ఓటమి తర్వాత బీజేపీకి భయం పట్టుకుందన్నారు. అలాగే వచ్చే యేడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక ఎన్నికల ఫలితాలు, కన్నియాకుమారి నుంచి కశ్మీర్‌దాకా ప్రభావం చూపుతాయనే భయంతోనే ప్రతిపక్షాలను భయపెట్టేందుకే ఐటీ, ఈడీ విభాగాలను రంగంలోకి దింపి దాడులు జరుపుతోందని విమర్శించారు. సీఎం స్టాలిన్‌ విదేశీ పర్యటనలో భారీ స్థాయిలో పెట్టుబడులు సమీకరిస్తున్న వేళ ఈ దాడులు జరగటం గర్హనీయమన్నారు. డీఎంకే కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించేందుకే ఈ దాడులు ఉద్దేశ పూర్వకంగా జరుగుతున్నాయన్నారు. దాడులు గురించి ఆయా ప్రాంతాల్లో స్థానిక పోలీసులకు సమాచారం తెలపుకుండా ఐటీ అధికారులు దురుసుగా వ్యవహరించారన్నారు. ఐటీ దాడులు ఎన్నిసార్లు నిర్వహించినా డీఎంకే భయపడదని, వాటిని చట్టప్రకారం ఎదుర్కొంటుందన్నారు.

పొంగులేటి ఖండన...

మంత్రి సెంథిల్‌బాలాజి అనుచరుల ఇళ్లల్లో తనిఖీలకు వెళ్లిన ఆదాయపు పన్నుల శాఖ అధికారుల వాహనాలపై డీఎంకే కార్యకర్తలు, సంఘ విద్రోహశక్తులు దాడులు జరపడాన్ని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కో-ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో తనిఖీలు జరిపేందుకు వచ్చిన అధికారులపై దాడులు జరపడమే ద్రావిడ తరహా పాలనా అని ఆయన ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఐటీ అధికారులపై, కార్లపై దాడులు జరిపిన దుండగులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-05-27T10:49:38+05:30 IST