BJP: టెర్రరిజంపై కొరడా కాంగ్రెస్‌కు ఇష్టం లేదు...డిగ్గీకి కౌంటర్

ABN , First Publish Date - 2023-01-23T19:09:08+05:30 IST

పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులకు ఆధారాలు లేవంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ..

BJP: టెర్రరిజంపై కొరడా కాంగ్రెస్‌కు ఇష్టం లేదు...డిగ్గీకి కౌంటర్

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులకు ఆధారాలు లేవంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సోమవారంనాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, ఇండియన్ ఆర్మీని, ప్రజలను, దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని అన్నారు. రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' ముఖ్య ఉద్దేశం కూడా దేశ ఐక్యతను దెబ్బతీయడమేనని విమర్శించారు.

''సర్జికల్ దాడులకు ఆర్మీ ఎలాంటి ఆధారాలు చూపించలేదని దిగ్విజయ్ చెబుతున్నారు. మన రక్షణ బలగాల శౌర్యాన్ని కాంగ్రెస్ ప్రతీసారి ప్రశ్నిస్తూనే ఉంది. దేశాన్ని కాపాడే బలగాల పట్ల వారికి నమ్మకం లేదు. బాధ్యత లేని ప్రకటనలు చేయడమే కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం. కానీ, ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడితే మాత్రం దేశం సహించదు'' అని భాటియా అన్నారు. విపక్ష పార్టీలు ప్రజలకు బాధ్యతగా ఉండాలన్నారు. సర్జికల్ దాడుల తర్వాతే దేశీయ ఉగ్రవాదం పెరిగందంటూ కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా చెబుతున్నారని, ఇది ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశానికి క్లీన్ చిట్ ఇవ్వడమేనని అన్నారు. రక్షణ బలగాలు ఎప్పుడు తమ శౌర్యం ప్రదర్శించినా కాంగ్రెస్ పార్టీ బాధతో విలవిల్లాడుతుందని విమర్శించారు.

పేరుకే ఐక్యతా యాత్ర...విడగొట్టడమే అసలు ఉద్దేశం

రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' పైనా గౌరవ్ భాటియా విమర్శలు గుప్పించారు. ప్రజలను ఐక్యం చేయడం, శాంతి-ప్రేమ సందేశాలను ప్రచారం చేయడం భారత్ జోడో యాత్ర ఉద్దేశమని రాహుల్ చెబుతున్నారని, అయితే ఆ యాత్ర వెనుక భారతదేశాన్ని విభజించే ఉద్దేశం ఉందని అన్నారు. ఇందుకు దిగ్విజయ్ తాజా వ్యాఖ్యలే నిదర్శనమని, ఆయన వాడిన భాష చూస్తే అది 'భారత్ టోడో యాత్ర' అనే విషయం అర్ధమవుతుందని చెప్పారు.

370 అధికరణ రద్దుపై...

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిపించే 370 అధికరణను కేంద్రం రద్దు చేయడంపై ఇప్పటికీ విమర్శల దుమారం తగ్గకపోవడాన్ని భాటియా తప్పుపట్టారు. అధికరణ రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో టూరిజం 3.5 రెట్లు పెరిగిందని, ఉగ్రవాదం 30 శాతం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. రాహుల్ గాంధీ రాజ్యాంగంపై ప్రమాణం చేశారని, కానీ రాజ్యాంగాన్ని చదివిందే లేదని అన్నారు. 370 అధికరణపై ఆయన తన వైఖరి ఏమిటో దేశానికి చెప్పాలని భాటియా డిమాండ్ చేశారు. దేశ ప్రజలంతా బీజేపీ, ఇండియన్ ఆర్మీవైపు ఉన్నారని, నిగ్రహం లేకుండా ప్రకటనలు చేస్తున్న వారు రాజకీయంగా జీరోలనీ, వారి రాజకీయ ఉనికి చిక్కుల్లో పడిందని ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-01-23T19:23:30+05:30 IST