BJP state president: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన ప్రకటన.. ఈ నెలాఖరులో ‘డీఎంకే అవినీతి చిట్టా-2’

ABN , First Publish Date - 2023-07-15T07:11:07+05:30 IST

డీఎంకే నేతల అవినీతి చిట్టా రెండో భాగాన్ని ఈ నెలాఖరులోపు విడుదల చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Ann

BJP state president: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన ప్రకటన.. ఈ నెలాఖరులో ‘డీఎంకే అవినీతి చిట్టా-2’

చెన్నై, (ఆంధ్రజ్యోతి): డీఎంకే నేతల అవినీతి చిట్టా రెండో భాగాన్ని ఈ నెలాఖరులోపు విడుదల చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ప్రకటించారు. ఏప్రిల్‌ 14న డీఎంకే నేతల అక్రమార్జనల వివరాలతో ‘డీఎంకే ఫైల్స్‌’ పేరుతో వెలువరించిన జాబితా తీవ్ర కలకలం సృష్టించింది. ఆ జాబితాలో డీఎంకే ఎంపీ టీఆర్‌బాలుకు రూ.10,841కోట్ల విలువైన 21 కంపెనీలున్నాయని ఆరోపించారు. ఆ ఆరోపణలను ఖండిస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్యాలను వెల్లడించిన అన్నామలైపై పరువునష్టం చట్టం ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ టీఆర్‌బాలు సైదాపేట సివిల్‌కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన మేజిస్ర్టేట్‌ ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు శుక్రవారం ఉదయం అన్నామలై వందలాదిమంది పార్టీ కార్యకర్తలను వెంటబెట్టుకుని సైదాపేట కోర్టుకు వచ్చారు. మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరైన తర్వాత కోర్టు వెలుపల అన్నామలై విలేఖరులతో మాట్లాడుతూ... డీఎంకే ఫైల్స్‌ మొదటి భాగం విడుదల చేసినప్పటి నుండే డీఎంకే నేతలు తనపై ఆగ్రహం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. టీఆర్‌ బాలు ముందుగానే కోర్టులో హాజరై సత్య ప్రమాణం చేసివెళ్ళారని, మూడు కంపెనీల్లో మాత్రమే తనకు వాటాలున్నాయని ఆయన తెలిపారని చెప్పారు. బీజేపీ న్యాయవాదుల విభాగం పటిష్టంగా ఉందని ఇప్పుడే తనకు తెలిసిందన్నారు. మళ్ళీ ఆగస్టు మూడోవారం కోర్టు విచారణకు హాజరుకావాలని మేజిస్ట్రేట్‌ తనను ఆదేశించారని తెలిపారు. డీఎంకే నేతల అవినీతికి సంబంధించిన రెండో జాబితా సిద్ధంగా ఉందని, ఆ జాబితాను గవర్నర్‌కు అందజేయలా? లేక డీజీపీకి సమర్పించాలా? అని ఆలోచిస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా ఆ జాబితాను తాను బహిరంగంగా విడుదల చేసే అవకాశం కూడా ఉందని, తాను చేపట్టనున్న పాదయాత్రకు ముందే ఆ జాబితా విడుదల చేస్తానని, ఆ మేరకు ఈ నెలాఖరుకల్లా జాబితా విడుదలవుతుందన్నారు. రెండో జాబితాలో డీఎంకే(DMK) నేతలు బినామీల పేరుతో సంపాదించిన అక్రమార్జనల వివరాలున్నాయని చెప్పారు. ఆ బినామీలు సమాజంలో పెద్ద మనుషులుగా ఉన్నారని చెప్పారు. బినామీలందరూ డీఎంకేకి చెందినవారేనని, నేతలకు బంధువులని అన్నామలై తెలిపారు.

nani1.2.jpg

Updated Date - 2023-07-15T07:11:07+05:30 IST