Same Sex Marriage : పెళ్లి చేసుకోవాలంటే ఆడ, మగ అవసరమా? : సీజేఐ

ABN , First Publish Date - 2023-04-20T18:11:33+05:30 IST

పెళ్లి చేసుకోవాలంటే జీవిత భాగస్వాములు లింగ పరంగా రెండు వేర్వేరు జాతులవారు అవసరమా? అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్

Same Sex Marriage : పెళ్లి చేసుకోవాలంటే ఆడ, మగ అవసరమా? : సీజేఐ
Supreme Court

న్యూఢిల్లీ : పెళ్లి చేసుకోవాలంటే జీవిత భాగస్వాములు లింగ పరంగా రెండు వేర్వేరు జాతులవారు అవసరమా? అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (Chief Justice DY Chandrachud) ప్రశ్నించారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మూడో రోజు విచారణ సందర్భంగా ఆయన ఈ ప్రశ్న వేశారు.

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన దాదాపు 15 పిటిషన్లపై ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. జస్టిస్ డీవై చంద్రచూడ్ గురువారం మాట్లాడుతూ, స్వలింగ వ్యక్తుల మధ్య సంబంధం కేవలం శారీరకపరమైనది కాదని, అంతకన్నా ఎక్కువగా నిలకడగల, భావోద్వేగపరమైన సంబంధమని తాము భావిస్తున్నామన్నారు. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలంటే, పెళ్లి యొక్క పరిణామ భావాన్ని పునర్నిర్వచించవలసి ఉంటుందన్నారు. ఎందుకంటే, పెళ్లి చేసుకోవడానికి భాగస్వాములు లింగ పరంగా వేర్వేరు జాతులకు చెందినవారు (స్త్రీ, పురుషులు) ఉండవలసిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు.

1954లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వచ్చిందని, ఆ తర్వాత 69 సంవత్సరాల నుంచి చట్టం చెప్పుకోదగ్గ రీతిలో పరిణామం చెందిందని తెలిపారు. పెళ్లి చేసుకోవాలనుకునేవారు తమ వ్యక్తిగత చట్టాలను పాటించకూడదని భావిస్తే, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకోవడానికి అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

హోమోసెక్సువాలిటీ నేరం కాదని 2018లో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. పరస్పరం ఇష్టపడే స్వలింగ వయోజన వ్యక్తుల మధ్య సంబంధాన్ని ఈ తీర్పు ద్వారా గుర్తించామన్నారు. అంతేకాకుండా ఇటువంటివారి మధ్య సంబంధం నిలకడగా ఉన్నట్లు కూడా గుర్తించామన్నారు. ట్రోలింగ్ జరుగుతుందనే భయం ఉన్నప్పటికీ, సార్వజనీనంగా చెల్లుబాటయ్యే సిద్ధాంతాలేవీ ఉండవన్నారు. స్త్రీ, పురుషులు పెళ్లి చేసుకున్నపుడు, వారి పిల్లలు గృహ హింసను చూస్తున్నపుడు జరిగేదేమిటని ప్రశ్నించారు. అటువంటి పిల్లలు సాధారణ వాతవరణంలో పెరుగుతారా? అని ప్రశ్నించారు. మద్యానికి బానిసైన తండ్రి ఇంటికొచ్చి, రోజూ రాత్రి తన తల్లిని కొడుతూ ఉంటే, మద్యం కోసం డబ్బులు అడుగుతూ ఉంటే, ఆ పరిస్థితిని చూసే పిల్లలు సాధారణ వాతావరణంలో పెరుగుతారా? అని ప్రశ్నించారు.

స్వలింగ వివాహాలు చేసుకుంటే పిల్లలు పుట్టడం సాధ్యం కాదని న్యాయవాదులు వాదించినపుడు జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ, స్త్రీ, పురుషులు వివాహం చేసుకున్నపుడు కూడా, నేటి కాలంలో విద్యా వ్యాప్తి జరగడంతోపాటు, ఆధునిక కాలపు ఒత్తిళ్లు కూడా పెరిగాయని, ఫలితంగా దంపతులు పిల్లలు లేకుండా అయినా ఉండిపోతున్నారని, కేవలం ఒకే బిడ్డను కనడమైనా చేస్తున్నారని అన్నారు. కొడుకు తప్పనిసరిగా ఉండాలనే భావం నుంచి దూరమవుతున్నారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఈ పిటిషన్లను తోసిపుచ్చాలని కోరుతోంది. పిటిషనర్లు పట్టణ ఉన్నత వర్గాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. దీనిపై చర్చించేందుకు సరైన వేదిక పార్లమెంటేనని చెప్పింది. చట్టసభలు విస్తృత ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలను కూడా స్వీకరించాలని తెలిపింది. భారతీయ కుటుంబాల్లో భర్త, భార్య, పిల్లలు ఉంటారని, ఇటువంటి కుటుంబంతో స్వలింగ వ్యక్తుల పెళ్లిని పోల్చకూడదని తెలిపింది.

స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు లేకపోతే, అనేక హక్కులను వినియోగించుకోవడం సాధ్యం కాదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. మెడికల్ కన్సెంట్, పింఛన్లు, పిల్లలను దత్తత తీసుకోవడం, క్లబ్ మెంబర్‌షిప్ వంటి హక్కులను పొందలేకపోతున్నట్లు తెలిపారు.

ఈ పిటిషన్లపై విచారణ జరుపుతున్న ధర్మాసనంలో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హిమ కొహ్లీ ఉన్నారు. పిటిషనర్ల తరపు వాదనలు సోమవారంతో ముగుస్తాయని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. ఈ గడువులోగా వాదనలను పూర్తి చేయడానికి తమలో తాము చర్చించుకోవాలని న్యాయవాదులను కోరారు.

ఇవి కూడా చదవండి :

Jammu and Kashmir : మోదీకి బాలిక లేఖతో సత్ఫలితాలు.. పాఠశాల అభివృద్ధి ప్రారంభం..

Solar Eclipse 2023 : అరుదైన సూర్య గ్రహణాన్ని కనులారా చూసిన ఆస్ట్రేలియన్లు, ఇండోనేషియన్లు

Updated Date - 2023-04-20T18:11:33+05:30 IST