Delhi Service Bill : ఎంపీల సంతకాల ఫోర్జరీ ఆరోపణలు.. కఠిన చర్యలు తీసుకుంటామన్న కేంద్ర మంత్రి..

ABN , First Publish Date - 2023-08-08T10:35:11+05:30 IST

ఢిల్లీ సర్వీసెస్ బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ ఛద్దా రాజ్యసభకు సమర్పించిన తీర్మానంపై కొందరు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు.

Delhi Service Bill : ఎంపీల సంతకాల ఫోర్జరీ ఆరోపణలు.. కఠిన చర్యలు తీసుకుంటామన్న కేంద్ర మంత్రి..

న్యూఢిల్లీ : ఢిల్లీ సర్వీసెస్ బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ ఛద్దా రాజ్యసభకు సమర్పించిన తీర్మానంపై కొందరు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. ఎంపీల సంతకాల ఫోర్జరీకి బాధ్యుడైన రాజ్యసభ సభ్యునిపై తీర్మానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. ఫోర్జరీ చేసేవారిని సమర్థిస్తారా? అని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు.

రాఘవ్ ఛద్దా ప్రతిపాదించిన తీర్మానంపై తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఐదుగురు ఎంపీలు ఆరోపించడంతో పార్లమెంటు సభ్యులు ఉలిక్కిపడ్డారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రులు డిమాండ్ చేశారు. ఫోర్జరీకి బాధ్యులైనవారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి మాట్లాడుతూ, తాను ఆరు సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రిగా పని చేస్తున్నానని, దాదాపు 30-40 సంవత్సరాల నుంచి పార్లమెంటు పనితీరును ఓ ప్రభుత్వాధికారిగా పరిశీలిస్తున్నానని, ఇటువంటి సంఘటనను తాను ఎన్నడూ చూడలేదని తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపించాలన్నారు.


కేంద్ర మంత్రి వీ మురళీధరన్ మాట్లాడుతూ, ఇది చాలా తీవ్రమైన విషయమని చెప్పారు. సమ్మతి పొందకుండా ఎంపీల పేర్లను నోటీసులో రాయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ ఛద్దా ఢిల్లీ సర్వీసెస్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కోరుతూ ఇచ్చిన నోటీసులో బీజేపీ, బీజేడీ, ఏఐఏడీఎంకే ఎంపీల పేర్లను, వారి సమ్మతి పొందకుండా చేర్చడం చాలా తీవ్రమైన విషయమని చెప్పారు. ఇది సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో సమానమని తెలిపారు. దీనిపై బాధిత ఎంపీలు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌కు ఫిర్యాదు చేశారని తెలిపారు.

రాఘవ్ ఛద్దాపై ప్రివిలెజ్ మోషన్

రాఘవ్ ఛద్దా రాజ్యసభకు సమర్పించిన నోటీసులో పేర్కొన్న ఎంపీల్లో బీజేపీ ఎంపీలు ఎస్ ఫంగ్నోన్ కొన్యక్, నరహరి అమిన్, సుధాంశు త్రివేది; ఏఐఏడీఎంకే ఎంపీ ఎం తంబిదురై, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రా పేర్లు ఉన్నాయి. తమ సమ్మతి లేకుండా తమ పేర్లను ఈ నోటీసులో చేర్చారని ఈ ఎంపీలు ఆరోపించారు. తమ పేర్లను ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ తంబిదురై రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాశారు. తాను ఎటువంటి పత్రంపైనా సంతకం చేయలేదని, ఈ నోటీసులో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉంటారని ఆరోపించారు.

ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిధూరీ మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ పార్టీని తీవ్రంగా విమర్శించారు. నకిలీ సంతకాలతో పార్లమెంటుకు తీర్మానాన్ని ప్రతిపాదించడం చాలా దురదృష్టకరమని చెప్పారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ, ఢిల్లీలో ఫోర్జరీ జరుగుతుండటంపై చర్చించుకున్నామని, ఇప్పుడు ఏకంగా పార్లమెంటులోనే ఫోర్జరీకి పాల్పడినట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలన్నారు.


ఇవి కూడా చదవండి :

Minister Senthilbalaji: మంత్రి సెంథిల్‌బాలాజీకి చుక్కెదురు.. ఈడీ అరెస్టు సక్రమమేనంటూ సుప్రీంకోర్టు స్పష్టీకరణ

No Confidence Motion : నూతనోత్సాహంతో పార్లమెంటుకు బయల్దేరిన రాహుల్ గాంధీ.. అవిశ్వాస తీర్మానంపై గర్జించబోతున్న యువ నేత..

Updated Date - 2023-08-08T10:35:11+05:30 IST