Electricity charges: బాబోయ్.. విద్యుత్ చార్జీలు పెరిగాయి..

ABN , First Publish Date - 2023-04-05T09:00:01+05:30 IST

ఇటీవల బడ్జెట్‌లో సామాన్యులపై కొన్ని వరాలు కురిపించిన రంగస్వామి నేతృత్వంలోని పుదుచ్చేరి ప్రభుత్వం.. తాజాగా కరెంట్‌ షాకిచ్చింది.

Electricity charges: బాబోయ్.. విద్యుత్ చార్జీలు పెరిగాయి..

- తక్షణం అమల్లోకి

పుదుచ్చేరి, (ఆంధ్రజ్యోతి): ఇటీవల బడ్జెట్‌లో సామాన్యులపై కొన్ని వరాలు కురిపించిన రంగస్వామి నేతృత్వంలోని పుదుచ్చేరి ప్రభుత్వం.. తాజాగా కరెంట్‌ షాకిచ్చింది. మంగళవారం విద్యుత్‌ చార్జీలు(Electricity charges) పెంచుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(State Electricity Regulatory Board) ఆదేశాల మేరకు ఈ చార్జీలు పెరిగినట్లు ప్రకటించింది. ఈ పెంచిన విద్యుత్‌ చార్జీలు ఈ నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో 100 యూనిట్ల వరకు గతంలో యూనిట్‌కు రూ.1.90 పైసలు వసూలు చేసేవారు. ఇపుడు దీన్ని రూ.2.25 పైసలుకు పెంచారు. అలాగే, 101 నుంచి 200 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.2.90 పైసలుగా ఉండగా దీన్ని రూ.3.25 పైసలకు పెంచేశారు. 201 నుంచి 300 యూనిట్ల వరకు ఒక యూనిట్‌కు రూ.5.40 పైసలు, 300 యూనిట్లకు పైబడితే రూ.6.80 పైసలు చొప్పున వసూలు చేస్తారు. అదేవిధంగా వాణిజ్య సంస్థలకు కూడా విద్యుత్‌ చార్జీలను కొత్తగా ఖరారు చేశారు. యూనిట్‌కు రూ.5.70 పైసలు చొప్పున వసూలు చేస్తుండగా, దీన్ని రూ.6కు పెంచారు. 101 నుంచి 250 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ.6.75 నుంచి రూ.7.05 పైసలుకు పెంచారు. 250 యూనిట్లకు పైబడి వినియోగించే వినియోగదారులు ఇకపై ఒక యూనిట్‌కు రూ.7.80 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీన్ని రూ.7.70గా వసూలు చేస్తున్నారు. ఈ పెంచిన విద్యుత్‌ చార్జీలు ఈ నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తాయని విద్యుత్‌ రెగ్యులేటరీ బోర్డు తెలిపింది.

ఇదికూడా చదవండి: మళ్లీ పెరుగుతున్న ‘కరోనా’: ఒకరు బలి!

Updated Date - 2023-04-05T09:00:01+05:30 IST