I.N.D.I.A : ఎన్డీయేను కూల్చాలంటే మహాకూటమి ఏకైక మార్గమా?

ABN , First Publish Date - 2023-08-31T20:06:37+05:30 IST

రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు దాదాపు 28 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ప్రతిపక్ష పార్టీల ఓట్లు గంపగుత్తగా కలిస్తే ఎన్డీయే అభ్యర్థులకు ఓటమి తప్పదని కొందరు ఢంకా బజాయించి చెప్తున్నారు.

I.N.D.I.A : ఎన్డీయేను కూల్చాలంటే మహాకూటమి ఏకైక మార్గమా?

న్యూఢిల్లీ : రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు దాదాపు 28 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ప్రతిపక్ష పార్టీల ఓట్లు గంపగుత్తగా కలిస్తే ఎన్డీయే అభ్యర్థులకు ఓటమి తప్పదని కొందరు ఢంకా బజాయించి చెప్తున్నారు. అదేవిధంగా భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గ్రాఫ్ బాగా పెరగడం కూడా దీనికి దోహదపడుతుందని అంటున్నారు. కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌లో పెరిగిన ఉత్సాహం, సామాన్యులను వేధిస్తున్న ధరలు, అదానీ-మోదీ సంబందాలు వంటివన్నీ మోదీని మూడోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టకుండా అడ్డుకుంటాయని చెప్తున్నారు. కానీ అది అసాధ్యమని ఈక్విటీ బ్రోకర్ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ (IIFL Securities) నివేదిక జోస్యం చెప్తోంది.

ప్రస్తుత ఓటింగ్ ధోరణులను పరిశీలించినపుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. కొత్తగా ఏర్పాటైన ఇండియా (I.N.D.I.A) కూటమి వల్ల ఎన్డీయేకు ముప్పు లేదని తెలిపింది. ఓటర్ల ధోరణిలో చెప్పుకోదగ్గ మార్పు రాకపోతే ఇండియా (Indian National Developmental Inclusive Alliance) విజయం సాధించడం జరగని పని అని చెప్పింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేతోపాటు వేర్వేరు పార్టీలకు లభించిన ఓట్లను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది.

ఈ నివేదిక ప్రకారం, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 38.5 శాతం ఓట్లు, ప్రస్తుత ఇండియా కూటమిలోని పార్టీలకు 38 శాతం ఓట్లు లభించాయి. అయితే ఎన్డీయేకు ఉత్తర భారతంలో ఎక్కువ ఓట్లు లభించగా, మిగిలిన పార్టీలకు దేశవ్యాప్తంగా ఈ ఓట్లు లభించాయి. ఒకే చోట ఎక్కువ ఓట్లు లభించే అవకాశాలు ఉండటంతో ఎన్డీయేకు ఎక్కువ స్థానాలు లభిస్తున్నాయి. 2024లో కూడా ఇదే పునరావృతమయ్యే అవకాశం ఉంది. మొత్తం లోక్ సభ నియోజకవర్గాలు 543 కాగా, వీటిలో 224 స్థానాల్లో ఎన్డీయే ఓట్ షేర్ 50 శాతం వరకు ఉంది.


ఎన్డీయే అభ్యర్థితో ఒకే ఒక ఇండియా అభ్యర్థి పోటీ చేయడం వల్ల ఇండియా కూటమి అభ్యర్థి తప్పనిసరిగా గెలుస్తారనే విశ్లేషణలు సరికాదని ఈ నివేదిక అంచనా వేసింది. ఎన్డీయే వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఏకీకృతమయ్యే అవకాశం కేవలం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో మాత్రమే ఉందని తెలిపింది. దీనివల్ల ఎన్డీయే స్థానాలు 330 నుంచి 313కు తగ్గుతాయని అంచనా వేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 272 మంది ఎంపీలు అవసరమవుతారు.

ఎన్డీయే వ్యతిరేక ఓట్లలో రెండు శాతం ఓట్లు ఇండియా కూటమికి వెళ్లినా, ఎన్డీయే కోల్పోయే స్థానాలు 28 మాత్రమేనని ఈ నివేదిక అంచనా వేసింది. ఈ పరిస్థితిలోనైనా ఎన్డీయేకు దాదాపు 285 స్థానాలు లభిస్తాయని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తుందని తెలిపింది. ప్రస్తుతం ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత చెప్పుకోదగిన స్థాయిలో లేదని తెలిపింది.

అయితే శాసన సభల ఎన్నికల్లో బీజేపీకి ఇటువంటి పరిస్థితి లేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పటికీ, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలపై ఆ ప్రభావం ఉండే అవకాశం లేదని అంచనా వేసింది. రానున్న ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ గెలిచే అవకాశాలు ఉన్నాయని, రాజస్థాన్‌లో ఆ పార్టీని గద్దె దించి, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేసింది. దీనినిబట్టి కేంద్రంలో ఎన్డీయేను గద్దె దించాలంటే, మహా కూటములు, ఓట్ల కలయికలు మాత్రమే కాకుండా ఇంకా ఏదో అవసరమని స్పష్టమవుతోంది.


ఇవి కూడా చదవండి :

Adani Group : తాజా ఆరోపణలను కొట్టిపారేసిన అదానీ గ్రూప్.. అవన్నీ పాత పాటలేనన్న పారిశ్రామిక దిగ్గజం..

Parliament : కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం

Updated Date - 2023-08-31T20:06:37+05:30 IST