Air India Pee Gate: మహిళపై మూత్రం పోసిన శంకర్ మిశ్రా అరెస్ట్

ABN , First Publish Date - 2023-01-07T18:04:48+05:30 IST

న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా(Air India) విమానంలో ఓ వృద్ధురాలిపై మూత్రం పోసిన శంకర్ మిశ్రా(Shankar Mishra)కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. ఘటన

 Air India Pee Gate: మహిళపై మూత్రం పోసిన శంకర్ మిశ్రా అరెస్ట్

న్యూఢిల్లీ: న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా(Air India) విమానంలో ఓ వృద్ధురాలిపై మూత్రం పోసిన శంకర్ మిశ్రా(Shankar Mishra)కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. ఘటన తర్వాత పరారైన శంకర్ మిశ్రా ఫోన్‌ను ట్రేస్ చేసిన పోలీసులు బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని ఢిల్లీ తీసుకెళ్లి పాటియాలా హౌస్ కోర్టు(Patiala House Court)లో ప్రవేశపెట్టారు. ఈ నెల 21 వరకు జుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు బెయిలు పిటిషన్‌ను ఈ నెల 11న విచారిస్తామని తెలిపింది.

పోలీసులు మూడు రోజుల కస్టడీ కోరగా, సరైన కారణాలు లేకుండా ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. నిందితుడు మిశ్రా ఇద్దరు ఎయిర్ ఇండియా విమాన పైలట్లు, కేబిన్ సిబ్బందికి ఫోన్లు చేస్తున్నాడని, వారిని కూడా విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఇంతకీ ఏం జరిగింది?

గతేడాది నవంబరు 26న న్యూయార్క్ (New York) నుంచి ఢిల్లీ(New Delhi) వెళ్తున్న విమానంలో మద్యం మత్తులో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న శంకర్ మిశ్రా మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోశాడు. ఆ సమయంలో క్యాబిన్ లైట్లు ఆపి ఉన్నాయి. ఈ ఘటనపై కేబిన్ సిబ్బంది వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ బాధిత మహిళ టాటా గ్రూప్ (Tata Group) చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌కు రాశారు.

మరోవైపు, ఈ ఘటన వెలుగు చూసి దుమారం రేపడంతో అమెరికాకు చెందిన బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గో (Wells Fargo).. వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న శంకర్ మిశ్రాను తొలగించింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ విమర్శలు రావడంతో శంకర్ మిశ్రాపై 30 రోజుల ట్రావెల్ బ్యాన్ విధించింది.

Updated Date - 2023-01-07T18:04:50+05:30 IST