Manipur : మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. పోలీసులు, బీజేపీ నేతలే లక్ష్యం..

ABN , First Publish Date - 2023-06-17T12:13:55+05:30 IST

మణిపూర్‌లో హింసాకాండ శుక్రవారం రాత్రి మళ్లీ ప్రారంభమైంది. షెడ్యూల్డు తెగల జాబితాలో ఉన్నవారు మే 3న ప్రారంభించిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారి, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఈ రాష్ట్రాన్ని సందర్శించి రాష్ట్రంలోని అన్ని వర్గాల నేతలతో మాట్లాడినప్పటికీ ప్రశాంతత నెలకొనడం లేదు.

Manipur : మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. పోలీసులు, బీజేపీ నేతలే లక్ష్యం..

న్యూఢిల్లీ : మణిపూర్‌లో హింసాకాండ శుక్రవారం రాత్రి మళ్లీ ప్రారంభమైంది. షెడ్యూల్డు తెగల జాబితాలో ఉన్నవారు మే 3న ప్రారంభించిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారి, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఈ రాష్ట్రాన్ని సందర్శించి రాష్ట్రంలోని అన్ని వర్గాల నేతలతో మాట్లాడినప్పటికీ ప్రశాంతత నెలకొనడం లేదు. తాజాగా శుక్రవారం రాత్రి ఆటోమేటిక్ తుపాకులను ధరించినవారు బిష్ణుపూర్ జిల్లాలోని క్వక్ట, చురాచాంద్‌పూర్‌లోని కంగ్వాయ్ ప్రాంతాల్లో కాల్పులు జరిపారు. శనివారం తెల్లవారుజాము వరకు కాల్పుల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి.

మెయిటీలకు షెడ్యూల్డు తెగల హోదా కల్పించడం గురించి పరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో కుకీ, తదితర తెగలవారు తీవ్ర ఆగ్రహంతో మే 3 నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో నిరసనకారులు విధ్వంసానికి తెగబడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు సైన్యం, అస్సాం రైఫిల్స్, రేపిడ్ యాక్షన్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా తూర్పు ఇంఫాల్‌ జిల్లాలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అడ్వాన్స్ హాస్పిటల్, ప్యాలస్ కాంపౌండ్ వద్ద దాదాపు వెయ్యి మంది నిరసనకారులు గృహ దహనాలకు పాల్పడేందుకు ప్రయత్నించారు. వీరిని చెదరగొట్టేందుకు రేపిడ్ యాక్షన్ ఫోర్స్ బాష్పవాయు గోళాలను, రబ్బరు తూటాలను ప్రయోగించింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

మణిపూర్ విశ్వవిద్యాలయం వద్దకు శుక్రవారం రాత్రి 10.40 గంటల సమయంలో దాదాపు 300 మంది చేరుకుని, స్థానిక ఎమ్మెల్యే నివాసాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నించారు. వీరిని ఆర్ఏఎఫ్ బృందం తరిమికొట్టింది. పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని ఇరింగ్బమ్ పోలీస్ స్టేషన్‌పై రాత్రి 11.40 గంటలకు దాడి చేసి, ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు దాదాపు 400 మంది ప్రయత్నించారు. వీరిని కూడా ఆర్ఏఎఫ్ తరిమికొట్టింది.

శుక్రవారం అర్ధరాత్రి సింజెమాయ్‌లోని బీజేపీ కార్యాలయం వద్దకు సుమారు 300 మంది చేరుకుని, విధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. వారిని సైన్యం తరిమికొట్టింది. పశ్చిమ ఇంఫాల్‌లో నివసిస్తున్న బీజేపీ రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ అధికారిమయుమ్ శారదా దేవి నివాసంపై కొందరు నిరసనకారులు దాడి చేశారు. వారిని సైన్యం, ఆర్ఏఎఫ్ బృందాలు చెదరగొట్టాయి. కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ నివాసాన్ని గురువారం పెట్రోలు బాంబులతో తగులబెట్టిన సంగతి తెలిసిందే. నిరసనకారులు ముఖ్యంగా రాజకీయ నేతల ఇళ్లు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Nitish Kumar : మాంఝీపై నితీశ్ కుమార్ తీవ్ర ఆరోపణలు

Wrestlers : రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. బ్రిజ్ భూషణ్‌పై ఫొటోలు, వీడియోల సాక్ష్యాలు..

Updated Date - 2023-06-17T12:13:55+05:30 IST