Minister: ఏం ఫర్వాలేదు.. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటా..

ABN , First Publish Date - 2023-09-08T07:51:13+05:30 IST

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి పలు రాష్ట్రాల్లో తనపై బీజేపీ నేతలు, ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు

Minister: ఏం ఫర్వాలేదు.. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటా..

- స్వామీజీల దిష్టిబొమ్మలు తగులబెట్టొద్దు

- కార్యకర్తలకు ఉదయనిధి పిలుపు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి పలు రాష్ట్రాల్లో తనపై బీజేపీ నేతలు, ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు కేసులు పెడుతున్నారని, ఎన్నికేసులు వచ్చినా తాను భయపడే ప్రసక్తేలేదని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) మరోమారు స్పష్టం చేశారు. వాటిని చట్ట ప్రకారం ఎదుర్కొనే సత్తా తనకుందన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి తన వ్యాఖ్యల్ని వక్రీకరించడంతో పాటు ప్రజల్లో చిచ్చు రగిల్చేలా మారణకాండకు పిలుపునిచ్చానంటూ ఆరోపణలు చేసిన అమిత్‌షా లాంటి కేంద్రమంత్రులు, బీజేపీ(BJP) ముఖ్యమంత్రులపై తాను కేసులు వేయాల్సి ఉందన్నారు. పెరియార్‌, అన్నాదురై(Periyar, Annadurai) ఆశయాలను ఆచరించే తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని, అన్ని మతాలను సమానంగా ఆదరిస్తామన్నారు.

ఈ విషయాలు తెలిసినా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న ప్రధాని మోదీ(Prime Minister Modi), ఆయన మంత్రివర్గ సభ్యులు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసుకునేందుకు ఇంట్లో దాచిపెట్టిన పుస్తకం వెతుకుతున్న మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) కూడా తన వ్యాఖ్యలపై అవాస్తవాలు వ్యాపిస్తున్నారన్నారు. దుష్ప్రచారాలతో ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్న ఆయన కొడనాడు కేసులో, అవినీతి అక్రమాల కేసుల నుండి బయటపడలేరని వ్యాఖ్యానించారు. తన తలకు వెలకట్టిన స్వామీజీల దిష్టిబొమ్మలు తగులబెట్టడం వంటి చర్యల్ని మానుకోవాలని కార్యకర్తలకు, అభిమానులకు ఉదయనిధి పిలుపునిచ్చారు.

Updated Date - 2023-09-08T07:51:15+05:30 IST