Sudan Crisis: సుడాన్ నుండి సురక్షితంగా బయటపడుతున్న తెలుగు ప్రవాసీయులు

ABN , First Publish Date - 2023-05-02T07:20:28+05:30 IST

సైనిక బలగాల మధ్య భీకరపోరులో సుడాన్‌లోని తెలుగు ప్రవాసీయులు బిక్కు బిక్కుమంటున్నారు.

Sudan Crisis: సుడాన్ నుండి సురక్షితంగా బయటపడుతున్న తెలుగు ప్రవాసీయులు

కీలక రంగాలలో మనోళ్ళు, అనేకులు యుద్ధ ప్రాంతానికి దూరం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సైనిక బలగాల మధ్య భీకరపోరులో సుడాన్‌లోని తెలుగు ప్రవాసీయులు బిక్కు బిక్కుమంటున్నారు. కొందరు తెలుగు వాళ్ళు పని చేస్తున్న దూర ప్రాంతాలలో ఏలాంటి ఉద్రిక్తత, దాడులు లేకున్నా సరఫరాలు లేక క్రమేణా దుకాణాలు మూతపడడం, విద్యుత్, టెలిఫోన్ వ్యవస్ధలకు అంతరాయం ఏర్పడడంతో మున్ముందు సరఫరాలకు విఘాతం ఏర్పడితే ఇబ్బందులకు గురవుతామనే భయంతో మాతృభూమికి తిరిగి వస్తున్నారు. మరికొందరు ప్రత్యేకించి బాంబుల దాడులు తీవ్రంగా ఉన్న రాజధాని ఖార్తోంలో ఉన్న తెలుగు ప్రవాసీయులు ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ దేశాన్ని వదలి వచ్చేస్తున్నారు.

దేశంలో సుమారు 300 మంది వరకు ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారున్నారని ఒక ప్రాథమిక అంచనా. వీరిలో చాలామంది గల్ఫ్ దేశాలలో పని చేసి, ఇంకా అధిక వేతనాల ఆశతో సుడాన్‌కు వెళ్ళిన వారు ఉన్నారు. సుడాన్‌లోని తెలుగు వారిలో అత్యధికులు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారున్నారు. వారిలో ఎక్కువ మంది సుడాన్‌లోని చక్కెర, ఉక్కు, సిరామిక్ పరిశ్రమలలో పని చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక రాజకీయ నాయకుడికి చెందిన విద్యుత్ ప్లాంటు నిర్వహణ సంస్ధలో కూడా చాలా మంది పని చేస్తున్నారు. కొందరు హైద్రాబాద్ నగరానికి చెందిన ముస్లింలు అక్కడ వివాహాలు చేసుకోని అక్కడే స్ధిరపడ్డారు. పటాన్‌చెరు బీహెచ్ఈఎల్ కాలనీకి చెందిన మోహమ్మద్ జియా సుమారు మూడు దశాబ్దాలుగా కుటుంబ సమేతంగా ఉండి పైపుల ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జియా, అతని భార్య భారతదేశానికి వచ్చేస్తున్నారు. హైద్రాబాద్ నగరానికి చెందిన కలీం అనే అతను సుడాన్ యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకోగా, తన భార్యను వదిలి వచ్చేదిలేదంటూ భీష్మించుకున్నాడు. అతని భార్య ఇండియాకు రావడానికి మిషన్ కావేరి నిబంధనలు అనుమతించడం లేదు.

దేశ వ్యాప్తంగా పరిస్ధితి సాధారణంగా ఉన్నా ఒక్క రాజధాని ఖార్తోంలో మాత్రమే భీకర పరిస్ధితి నెలకొని ఉందని ప్రత్యక్ష సాక్షులు ఆంధ్రజ్యోతికి వివరించారు. ఖార్తోం నగర, శివారు ప్రాంతాలలోని పారిశ్రామిక వాడలపై జరుపుతున్న బాంబుల దాడుల కారణంగా ఈ పరిశ్రమలలో పని చేసున్న, నగరంలో నివాసముంటున్న వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నరకయాతన అనుభవిస్తున్నారు. తాను పని చేస్తున్న సంస్ధ అవరణలో భారీగా బాంబులు వేయడంతో ల్యాబ్‌లో వారం రోజుల పాటు దాక్కున్నట్లుగా నెల్లూరు జిల్లా సూళ్ళురుపేటకు చెందిన అందాడి ఆశోక్ చెప్పారు.

భారతీయ వైమానిక దళ విమానంలో తరలించిన అనేక మందిలో ఒకడయిన అశోక్. ఆ తర్వాత అతని ఫ్యాక్టరీపై స్ధానికులు దాడి చేసి సామాన్లు ఎత్తుకెళ్ళడానికి వచ్చినప్పుడు సందట్లో సడేమియాగా బయటకు వచ్చి భారతీయ ఎంబసీకి చేరుకున్నాడు. ప్రాణంతో బయటపడింది చాలని కరీంనగర్‌కి చెందిన బండి జయరాజు చెప్పారు. పరిస్ధితి కుదుటపడిన తర్వాత తాను తిరిగి సుడాన్ వెళ్తానని హైద్రాబాద్ నగరానికి చెందిన అబ్దుల్ బారీ ఆంజద్ అన్నారు. తమ సంస్ధలో అందరు భారతీయులేనని, ఎవరు కూడా భారతదేశానికి వెళ్ళడానికి సిద్ధంగా లేకున్నా తమ నివాసంపై విసిరిన బాంబుల కారణంగా భారతదేశానికి వెళ్లవల్సి వస్తుందని ఆయన పెర్కొన్నారు. విద్యుత్ లేకపోవడంతో కేవలం అర్ధగంట జనరేటర్ ఆన్ చేసి ఫోన్ బ్యాటరీ చార్జింగ్ చేసుకుంటున్నట్లుగా ఖమ్మంకు చెందిన ఆర్. శ్రీనివాసరావు చెప్పారు. ఆయన గత 12 ఏళ్ళుగా సుడాన్‌లో ఉంటున్నారు.​వీరందరు కూడా కేంద్ర ప్రభుత్వ మిషన్ కావేరిని అభినందిస్తూ ప్రభుత్వ చర్యకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-05-02T07:20:28+05:30 IST