Tirupathi: తిరుపతి నగరం ఎప్పుడు పుట్టింది..?

ABN , First Publish Date - 2023-02-24T18:18:38+05:30 IST

తిరుమల, తిరుపతి. ఈ రెండు వేరు వేరు ఊళ్ళు. కానీ మనందరం కామన్‌గా ఈ రెండు ఊళ్ళను తిరుపతిగానే పిలుస్తుంటాం. నిజానికి తిరుపతి నుంచి తిరుమల 22 కిలోమీటర్ల దూరంలో ఏడుకొండలపైన ఉంది. తిరు అంటే శ్రీ అని.. మలై అంటే కొండ అని అర్థం. అంటే..

Tirupathi: తిరుపతి నగరం ఎప్పుడు పుట్టింది..?

తిరుపతి (Tirupati birthday): తిరుమల, తిరుపతి. ఈ రెండు వేరు వేరు ఊళ్ళు. కానీ మనందరం కామన్‌గా ఈ రెండు ఊళ్ళను తిరుపతిగానే పిలుస్తుంటాం. నిజానికి తిరుపతి నుంచి తిరుమల 22 కిలోమీటర్ల దూరంలో ఏడుకొండలపైన ఉంది. తిరు అంటే శ్రీ అని.. మలై అంటే కొండ అని అర్థం. అంటే శ్రీనివాసుడు నివసించే కొండ అనుకోవచ్చు. తిరుమల తిరుపతితో హిందూ సమాజానిది విడదీయలేని అనుబంధం. తిరుమల పేరు తలుచుకుంటేనే శరీరం రోమాంచితమవుతుంది. అప్రయత్నంగానే పెదవులు గోవిందనామాన్ని పలుకుతాయి. అలాంటి తిరుమల, తిరుపతి (Tirumala Tirupati) ఆవిర్భావ దినోత్సవాన్ని తిరుపతి ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారు. నిజానికి ఒక ఊరుకు ఆవిర్భావ దినోత్సవం ఉండటమనేది అరుదే. కానీ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు (Lord Venkateswara) కొండపై పాదం మోపిన కాలమే కలియుగారంభం కాబట్టి... కలియుగం మొదలై ఫిబ్రవరి 24వ తేదీ నాటికి 5,125 ఏళ్ళు పూర్తయింది.

Kapila-Theertham.jpg

అలాగే శ్రీనివాసుడి పాదాల చెంత ఉండే తిరుపతికి ఎంతో ఆసక్తికరమైన, పురాతనమైన చరిత్ర ఉంది. తొలుత తిరుపతిని కొత్తూరుగా వ్యవహరించేవారు. ప్రస్తుతం కపిలతీర్థం (Kapilatirtham) ఉన్న ప్రాంతంలోనే ఓ చిన్న ఊరు ఉండేది. దీనినే కొత్తూరుగా పిలిచేవారు. తదనంతర కాలంలో తిరుమలలో వైఖానసాగామాన్ని ఏర్పాటుచేసి, పూజాకైంకర్యాలకు జియ్యంగార్ల వ్యవస్థను రూపొందించిన భగవద్రామానుజాచార్యులే తిరుపతి పట్టణం (Tirupati town) రూపొందడానికి కారణమయ్యారు. ఒకనాటి పార్థసారధి స్వామి ఆలయంగా ప్రసిద్ధిగాంచిన నేటి గోవిందరాజస్వామి (Govindaraja Swami) వారి గుడిలో శ్రీరంగం నుంచి తెప్పించిన శ్రీగోవిందరాజస్వామివారిని ప్రతిష్ఠించడానికి పూనుకున్నారు. అయితే ఆ విగ్రహాన్ని తరలించే క్రమంలో అది భిన్నమవడంతో దానిని తిరుపతిలోని మంచినీళ్ళగుంట అనే ప్రాంతంలో అలాగే వదిలివేశారు. నేటికీ భక్తులు ఈ మనోహరమైన గోవిందరాజస్వామివారి విగ్రహాన్ని మంచినీళ్ళ గుంట వద్ద చూడవచ్చు. దీంతో అప్పటికప్పుడు సున్నం, గారతో చేసిన గోవిందరాజస్వామివారి విగ్రహాన్ని తయారుచేసి ప్రతిష్ఠించారు.

Tirumala-Temple-Streets.jpg

అందుకే ఈ స్వామివారికి తైలాభిషేకం మాత్రమే, అదీ ఏడాదికోసారి మాత్రమే చేస్తారు. స్వామివారికి ఇతరత్రా అభిషేకాలు ఉండవు. ఇక గోవిందరాజస్వామి వారి ఆలయ మాడవీధులు చుట్టూ ఉన్న ప్రాంతాన్నే గోవిందరాజపురమని, గోవిందరాజపట్నమని (Govindarajapatnam) పిలిచేవారు. భగవద్రామానుజాచార్యులు తిరుపతికి వచ్చిన కాలాన్ని ప్రామాణికంగా తీసుకుని తిరుపతి నగరం ఆవిర్భవించి.. ఫిబ్రవరి 24వ తేదీకి 893 సంవత్సరాలు అవుతుందని లెక్కగట్టారు. భగవద్రామానుజాచార్యులు (Ramanuja) 120 సంవత్సరాల సుదీర్ఘజీవితాన్ని గడిపారు. తన జీవితకాలంలో ఆయన మూడుసార్లు తిరుమలకు వచ్చారు. ఈయన తన 112వ ఏట గోవిందరాజస్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిప్రకారమే తిరుపతి ఆవిర్భావదినోత్సవాన్ని జరుపుతున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తం తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుతున్నాయి. దీనికి స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి (MLA Bhumana Karunakara Reddy) నేతృత్వం వహిస్తున్నారు.

Updated Date - 2023-02-24T18:59:47+05:30 IST