Asia Cup 2023: కుర్రాళ్ల వల్ల కాలేదు.. మరి సీనియర్లు ఏం చేస్తారో?

ABN , First Publish Date - 2023-07-24T17:37:13+05:30 IST

ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. జూనియర్ల తరహాలో కాకుండా సీనియర్లు ఆసియా కప్ విజేతగా నిలుస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమర్జింగ్ ఆసియా కప్‌లో టీమిండియా కుర్రాళ్ల జట్టు ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. టోర్నీ ఆసాంతం అపజయం లేకుండా సాగినా ఫైనల్లో మాత్రం యువ క్రికెటర్లు అనుభవలేమితో ఓటమి పాలై అభిమానులను నిరాశపరిచారు.

Asia Cup 2023: కుర్రాళ్ల వల్ల కాలేదు.. మరి సీనియర్లు ఏం చేస్తారో?

ఎమర్జింగ్ ఆసియా కప్‌లో టీమిండియా కుర్రాళ్ల జట్టు ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. టోర్నీ ఆసాంతం అపజయం లేకుండా సాగినా ఫైనల్లో మాత్రం యువ క్రికెటర్లు అనుభవలేమితో ఓటమి పాలై అభిమానులను నిరాశపరిచారు. తుది సమరంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ విధించిన 353 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించలేక 128 రన్స్ తేడాతో ఘోర ఓటమిని చవి చూశారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సీనియర్ క్రికెటర్లు పాల్గొనే ఆసియా కప్‌పై పడింది. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో బిజీగా ఉన్న టీమిండియా ఆ తర్వాత ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. ఐర్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత ఆసియా కప్ కోసం శ్రీలంక వెళ్లనుంది. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. మరి జూనియర్ల తరహాలో కాకుండా సీనియర్లు ఆసియా కప్ విజేతగా నిలుస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


ఆసియా కప్‌లో టీమిండియా ఆడే గ్రూప్‌లో పాకిస్థాన్, నేపాల్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తన తొలి మ్యాచ్‌ను పల్లెకెలె వేదికగా సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. పాకిస్థాన్‌తో గెలిచినా ఓడినా మరో టీమ్ నేపాల్‌పై గెలిచే అవకాశం ఉంటుంది. దీంతో సూపర్-4 దశకు భారత్, పాకిస్థాన్ వెళ్లనున్నాయి. సూపర్-4లో భారత్, పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్ ఆడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ బంగ్లాదేశ్ రాకపోయినా ఆప్ఘనిస్తాన్ వస్తుంది కాబట్టి మొత్తంగా చూసినా ఫైనల్‌కు భారత్, పాకిస్థాన్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది భారత్ ఫైనల్‌కు చేరలేకపోయింది. కానీ ఈసారి అలాగే జరగదని అభిమానులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: IPL 2024: బీసీసీఐ కీలక నిర్ణయం.. మరింత పెరగనున్న ఐపీఎల్ రేంజ్?

ఒకవేళ భారత్, పాకిస్థాన్ ఫైనల్‌కు దూసుకెళ్లినా టీమిండియా విజేతగా నిలుస్తుందా అన్నదే ఇప్పుడు సగటు క్రికెట్ అభిమాని ప్రశ్న. ఎమర్జింగ్ ఆసియా కప్‌లో కుర్రాళ్లు లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించి ఎన్నో ఆశలు రేపారు. అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, యష్ ధూల్, హర్షిత్ రాణా, నిషాంత్ సింధు వంటి క్రికెటర్లు టోర్నీలో రాణించినా ఫైనల్లో మాత్రం పేలవ ప్రదర్శన చేశారు. సీనియర్ జట్టు విషయానికి వస్తే రోహిత్, కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా వంటి క్రికెటర్లు ఉన్నా పాకిస్థాన్‌పై ఎలా ఆడతారో చూడాలి. లీగ్ మ్యాచ్‌లలో గెలవగానే పొంగిపోకుండా ముందుకు సాగిపోవాలి. ముఖ్యంగా పాకిస్థాన్‌తో మూడుసార్లు తలపడే అవకాశం ఉండటంతో ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

1.jpg


బౌలింగ్‌లో బలమేది?

అయితే బౌలింగ్ దళం భారత జట్టును ఆందోళన పరుస్తోంది. సిరాజ్ మినహాయిస్తే బౌలింగ్‌లో బలం కనిపించడం లేదు. షమీ, బుమ్రా, భువనేశ్వర్, హర్షల్ పటేల్ వంటి ప్రతిభావంతులు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉంటున్నారు. వీళ్లు ఆసియా కప్‌లో ఆడే అవకాశాలు అంతంత మాత్రమే. దీంతో భారత్ విజయావకాశాలు ఎలా ఉంటాయన్న ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. ఆసియా కప్ జరిగేది ఉపఖండంలో కాబట్టి ఇద్దరు స్పిన్నర్లు జట్టులో ఉంటారు. ప్రధాన స్పిన్నర్లుగా జడేజా, చాహల్‌కు బెర్తులు ఖాయంగా కనిపిస్తోంది. పేస్ విభాగం విషయానికి వస్తే సిరాజ్, హార్దిక్ పాండ్యలతో పాటు మూడో పేసర్‌గా ఎవరు బాధ్యతలు తీసుకుంటారో వేచి చూడాలి.

Updated Date - 2023-07-24T17:37:13+05:30 IST