Team India: కేఎల్ రాహుల్ వస్తే.. బలయ్యేదెవరు? ఫామ్‌లో ఉన్న అతడేనా?

ABN , First Publish Date - 2023-09-08T19:07:01+05:30 IST

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం జరిగే కీలక మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడి రాకతో టీమిండియాలో బలయ్యే ఆటగాడు ఎవరో అర్ధం కాక అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

Team India: కేఎల్ రాహుల్ వస్తే.. బలయ్యేదెవరు? ఫామ్‌లో ఉన్న అతడేనా?

టీమిండియా సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఎట్టకేలకు మ్యాచ్ ఆడబోతున్నాడు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఆసియా కప్‌లో లీగ్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అతడు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం జరిగే కీలక మ్యాచ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే అతడు వస్తే ప్రస్తుత జట్టులో బలయ్యేదెవరో అర్ధం కావడం లేదని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఓపెనర్‌గా రాణించని శుభ్‌మన్ గిల్‌ను తప్పిస్తారా లేదా ఇటీవల జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్‌ను తప్పిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ వీళ్లిద్దరినీ కాకపోతే ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను తప్పించాల్సి ఉంటుంది. మరి కేఎల్ రాహుల్ రాకతో బలయ్యేదెవరో తెలుసుకోవాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.

ఇటీవల పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. రోహిత్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అయితే నేపాల్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్, గిల్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ నేపథ్యంలో ఓపెనింగ్ జోడీని మార్చేంత సాహసం టీమ్ మేనేజ్‌మెంట్ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఆసియా కప్‌తోనే రీ ఎంట్రీ చేసిన శ్రేయాస్‌ను కూడా తొలగించకపోవచ్చని సమాచారం. మరి రాహుల్‌కు చోటు ఇవ్వాలంటే ఇషాన్ కిషన్ ఒక్కడే త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇషాన్ తరహాలో రాహుల్ కూడా కీపింగ్ చేయగలడు. అయితే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అందరూ విఫలమైన చోట అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్‌ను తప్పించడం కంటే ఘోర తప్పిదం మరొకటి ఉండదు. మరి కెప్టెన్ రోహిత్ మనసులో ఏముందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి: Cricket News: ఆదివారం నాడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. అదిరిపోయే న్యూస్ చెప్పిన ఏసీసీ

కాగా తరచూ ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్‌ను ఆసియా కప్ కోసం సెలక్టర్లు ఎంపిక చేశారు. అతడు గాయం కారణంగా ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ వన్డే ప్రపంచకప్ టీమ్‌లో కూడా రాహుల్ పేరు చేర్చారు. దీంతో సెలక్టర్లపై విమర్శల వర్షం కురుస్తోంది. అయితే అతడి ఎంపికపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా విలువైన పాయింట్ చెప్పాడు. అన్ని ఫార్మాట్లలో రాహుల్ నిలకడగా రాణించాడని, అలాగే ఓపెనర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలిగే ఫ్లెక్సిబులిటీ ఉన్న ప్లేయర్ అని తెలిపాడు. అందుకే సెలక్టర్లు కేఎల్ రాహుల్‌కు ప్రాధాన్యత ఇచ్చారని ఆకాష్ చోప్రా వివరించాడు.

Updated Date - 2023-09-08T19:07:01+05:30 IST