Asia Cup 2023: పాకిస్థాన్‌కు భారీ నష్టం.. పరిహారం ఇవ్వాలని డిమాండ్

ABN , First Publish Date - 2023-09-07T13:05:00+05:30 IST

ఆసియా కప్ కారణంగా తాము భారీగా నష్టపోయామని.. తమకు నష్టపరిహారం చెల్లించాలని ఆసియా కప్ కౌన్సిల్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. హైబ్రిడ్ మోడల్ అని ప్రతిపాదన వచ్చిన తర్వాత తాము ఆసియా కప్‌ను యూఏఈలో నిర్వహిస్తామని చెప్పామని.. కానీ బీసీసీఐ ఒత్తిడి కారణంగానే శ్రీలంకలో నిర్వహించేందుకు ఏసీసీ నిర్ణయం తీసుకుందని పీసీబీ మండిపడుతోంది.

Asia Cup 2023: పాకిస్థాన్‌కు భారీ నష్టం.. పరిహారం ఇవ్వాలని డిమాండ్

ఆసియా కప్ చప్పగా సాగుతోంది. కీలక మ్యాచ్‌లకు వర్షం ఆటంకం సృష్టిస్తుండటంతో క్రికెట్ అభిమానులు ఆసియా కప్ మ్యాచ్‌లను లైట్ తీసుకుంటున్నారు. మరోవైపు ఆసియా కప్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఆసియా కప్ కౌన్సిల్ మధ్య వార్ నడుస్తోంది. పాకిస్థాన్‌లో పర్యటించడం కుదరదని టీమిండియా స్పష్టం చేసిన నేపథ్యంలో ఆసియా కప్‌ను ఏసీసీ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తోంది. దీంతో పాకిస్థాన్‌తో పాటు శ్రీలంకలోనూ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. కానీ శ్రీలంకలో భారీ వర్షాల కారణంగా ఆసియా కప్ కళ తప్పింది. ముఖ్యంగా ఎంతో ఆసక్తి రేపిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో పీసీబీకి భారీ నష్టం వచ్చిందని తెలుస్తోంది.

ఆసియా కప్ కారణంగా తాము భారీగా నష్టపోయామని.. తమకు నష్టపరిహారం చెల్లించాలని ఆసియా కప్ కౌన్సిల్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. హైబ్రిడ్ మోడల్ అని ప్రతిపాదన వచ్చిన తర్వాత తాము ఆసియా కప్‌ను యూఏఈలో నిర్వహిస్తామని చెప్పామని.. కానీ బీసీసీఐ ఒత్తిడి కారణంగానే శ్రీలంకలో నిర్వహించేందుకు ఏసీసీ నిర్ణయం తీసుకుందని గతంలో పీసీబీ చీఫ్ నజాం సేధీ ఆరోపించారని గుర్తుచేసింది. శ్రీలంకలో మ్యాచ్‌లు నిర్వహించడంతో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు అయ్యిందని.. భారత్-నేపాల్ మ్యాచ్‌కు కూడా ప్రేక్షకులు సరిగ్గా రాలేదని.. దీనికి కారణం ఏసీసీ వైఖరేనని పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వేదికను మార్చే విషయంలో తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఏసీసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని ప్రస్తుత పీసీబీ చీఫ్ జాకా అష్రాఫ్ ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Veteran Cricketers: టీమిండియాలో ఇకపై వీళ్ల కెరీర్ ఖేల్ ఖతమేనా?

అటు వర్షాల కారణంగా సూపర్-4 మ్యాచులను కొలంబోను నుంచి హంబన్‌తోటకు మార్చాలని తాము సూచించామని.. కానీ చివరకు ఆసియా కప్ కౌన్సిల్ ఎవ్వరికీ చెప్పకుండా కొలంబోనే మ్యాచులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని పీసీబీ చీఫ్ జాకా అష్రాఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పీసీబీని ఏసీసీ ఏమాత్రం లెక్కచేయడం లేదని.. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో తమకు సమాచారం ఇవ్వడం లేదని మండిపడ్డాడు. ఆసియా కప్ నిర్వహణ కారణంగా నష్టపోయిన తమకు పరిహారం ఇవ్వాల్సిందేనని పీసీబీ చీఫ్ డిమాండ్ చేశాడు.

Updated Date - 2023-09-07T13:05:00+05:30 IST