IND vs WI: విలాసాలు కోరుకోవడం లేదు.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై హార్దిక్ పాండ్యా అసంతృప్తి

ABN , First Publish Date - 2023-08-02T16:21:26+05:30 IST

రెండు, మూడో వన్డేల్లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మూడో వన్డే మ్యాచ్ అనంతరం పోస్ట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో హార్దిక్ మాట్లాడుతూ.. భారత ఆటగాళ్ల కనీసం అవసరాలను తీర్చడంలో కూడా విండీస్ బోర్డు విఫలమైందని విమర్శలు గుప్పించాడు.

IND vs WI: విలాసాలు కోరుకోవడం లేదు.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై హార్దిక్ పాండ్యా అసంతృప్తి

ట్రినిడాడ్: రెండు, మూడో వన్డేల్లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మూడో వన్డే మ్యాచ్ అనంతరం పోస్ట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో హార్దిక్ మాట్లాడుతూ.. భారత ఆటగాళ్ల కనీసం అవసరాలను తీర్చడంలో కూడా విండీస్ బోర్డు విఫలమైందని విమర్శలు గుప్పించాడు. తాము విలాసాలు కావాలని కోరుకోవడం లేదని, కనీసం సౌకర్యాలైనా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపాడు. తమ జట్టు మళ్లీ వెస్టిండీస్ పర్యటనకు వచ్చినప్పుడు ఆ దేశ బోర్డు కనీస సౌకర్యాలను కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.


‘‘మేము ఆడిన చక్కటి మైదానాలలో ఈ బ్రియన్ లారా స్టేడియం ఒకటి. మేము మళ్లీ వెస్టిండీస్‌కు వచ్చినప్పుడు పరిస్థితులు మెరుగ్గా ఉంటాయని ఆశిస్తున్నాను. ప్రయాణాల నుంచి కనీస సౌకర్యాలు కల్పించడం వరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఎటువంటి అవాంతరాలు లేకుండా చూసుకుంటుందని భావిస్తున్నాను. గతంలో మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పరిస్థితులు ఇలానే ఉన్నాయి. మేము విలాసాలు కావాలని కోరుకోవడం లేదు. కానీ మా ప్రాథమిక అవసరాలైనా తీర్చాలని అడుగుతున్నాం’’ అని పాండ్యా చెప్పుకొచ్చాడు. కాగా రెండో టెస్ట్ మ్యాచ్ అనంతరం వన్డే మ్యాచ్ వేదికైన ట్రినిడాడ్‌కు చేరుకోవడానికి భారత జట్టుకు తీవ్ర ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. విమానం ఆలస్యం కావడంతో భారత ఆటగాళ్లు రాత్రంతా విమానశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

ఇక చివరిదైన మూడో వన్డేలో వెస్టిండీస్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన భారత కుర్రాళ్లు ఏకంగా 200 పరుగుల భారీ తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. పరుగుల పరంగా వెస్టిండీస్‌పై టీమిండియాకు ఇది రెండో అతిపెద్ద విజయం కావడం గమనార్హం. మ్యాచ్‌తోపాటు సిరీస్‌ను కూడా టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోర్ సాధించింది. శుభ్‌మన్ గిల్(85), ఇషాన్ కిషన్(77), హార్దిక్ పాండ్యా(70), సంజూ శాంసన్ (51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం లక్ష్య చేధనలో35.3 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 151 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4, ముఖేష్ కుమార్ 3, కుల్దీప్ యాదవ్ 2, జయదేవ్ ఉనద్కత్ ఒక వికెట్ పడగొట్టారు. గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

Updated Date - 2023-08-02T16:21:26+05:30 IST