Yashasvi Jaiswal: కల నెరవేరిన వేళ!.. కుటుంబానికి అదిరిపోయే బహుమతి ఇచ్చిన యశస్వి జైస్వాల్

ABN , First Publish Date - 2023-07-15T16:38:00+05:30 IST

అరంగేట్రంలోనే భారీ సెంచరీతో దుమ్ములేపిన టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తన కుటుంబానికి అదిరిపోయే బహుమతిని ఇచ్చాడు. తన కుటుంబం కోసం ఏకంగా 5 బెడ్‌రూంల ఇంటిని కొన్నాడు. ఇటీవల అతని కుటుంబం డబుల్ బెడ్‌రూం ఇంటి నుంచి 5 బెడ్‌రూంల ఇంటికి మారింది.

Yashasvi Jaiswal: కల నెరవేరిన వేళ!.. కుటుంబానికి అదిరిపోయే బహుమతి ఇచ్చిన యశస్వి జైస్వాల్

అరంగేట్రంలోనే భారీ సెంచరీతో దుమ్ములేపిన టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తన కుటుంబానికి అదిరిపోయే బహుమతిని ఇచ్చాడు. తన కుటుంబం కోసం ఏకంగా 5 బెడ్‌రూంల ఇంటిని కొన్నాడు. ఇటీవల అతని కుటుంబం డబుల్ బెడ్‌రూం ఇంటి నుంచి 5 బెడ్‌రూంల ఇంటికి మారింది. చాలా కాలంగా యశస్వి జైస్వాల్‌కు రెండు ఆకాంక్షలు ఉన్నాయి. ఒకటి భారత జట్టు తరఫున ఆడడం అయితే, మరొకటి సొంత ఇంటిని కొనుగోలు చేయడం. ఈ క్రమంలోనే యశస్వ జైస్వాల్ వెస్టిండీస్ పర్యటన సందర్భంగా టీమిండియాకు ఎంపికయ్యాడు. డొమినికా వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో మొదటి టెస్ట్ మ్యాచ్‌లోనే భారీ సెంచరీ(171)తో దుమ్ములేపాడు. అలాగే తన కుటుంబం కోసం ముంబైలో 5 బెడ్‌రూంల విలాసవంతమైన ప్లాట్‌ను కూడా కొనుగోలు చేశాడు. దీంతో జైస్వాల్‌కు ఉన్న ఈ రెండు కోరికలు నెరవేరాయి. యశస్వి జైస్వాల్‌కు సొంత ఇంట్లో ఉండాలని చాలా కాలం నుంచి కోరిక ఉందని అతని సోదరుడు తెలిపాడు. కాగా జైస్వాల్ కుటుంబం ఇటీవల కొత్త ఇంటిలోకి మారింది. కొత్త ఇంటిలోనే వెస్టిండీస్ పర్యటనలో ఆడుతున్న జైస్వాల్ బ్యాటింగ్‌ను కూడా వీక్షించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో యశస్వి జైస్వాల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఇక యశస్వి జైస్వాల్ తన మొదటి టెస్ట్ మ్యాచ్‌లోనే తన సత్తా ఏంటో చూపించాడు. ఏకంగా సెంచరీతో చెలరేగాడు. 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 171 పరుగులతో దుమ్ములేపాడు. అతనికి ఇతర ఆటగాళ్లు కూడా సహకరించడంతో మొదటి టెస్ట్‌లో వెస్టిండీస్‌ను టీమిండియా సునాయసంగా ఓడించింది. రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగగా.. అశ్విన్ 12 వికెట్లతో విశ్వరూపం చూపించాడు. మన బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ జట్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిసి కనీసం 300 పరుగులు కూడా చేయలేకపోయింది. మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులు చేసింది. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 421 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెరీర్‌లో మొదటి మ్యాచ్‌లోనే జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకోవడం గమనార్హం.

Updated Date - 2023-07-15T16:39:53+05:30 IST