Amit Shah: తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా సుదీర్ఘ మంతనాలు.. కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2023-03-12T17:59:09+05:30 IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sunjay), సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సమావేశమయ్యారు.

Amit Shah: తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా సుదీర్ఘ మంతనాలు.. కీలక ఆదేశాలు

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ (BJP) అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sunjay), సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై 4 గంటలపాటు సుదీర్ఘంగా నేతలు చర్చించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై అమిత్ షాకు బ్రీఫ్ నోట్ అందించినట్లు బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు, దేశంలోని పొలిటికల్ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీకి అవకాశం ఉందని తెలంగాణ బీజేపీ నేతలతో (Telangana BJP leaders) అమిత్ షా అన్నారు. నాయకులంతా కలసికట్టుగా పనిచేయాలని అమిత్ షా నిర్దేశించారు. పార్టీలో చేరికలపై దృష్టి పెట్టాలని బండి, కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లకు అమిత్ షా ఆదేశాలు ఇచ్చారు.

అయితే ఉగ్రవాదం, నక్సలిజంలలో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చెప్పారు. గతంలో అటువైపు వెళ్లినవారిలో అనేక మంది ప్రధాన జీవన స్రవంతిలో చేరుతున్నారన్నారు. ఉగ్రవాదం (Terrorism), నక్సలిజం (Naxalism)లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) 54వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడారు.

సురక్షితమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందదని చెప్పారు. మన దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నిర్ణయించారని, దీనిని సాధించడంలో సీఐఎస్ఎఫ్ పాత్ర చాలా ముఖ్యమైనదని తెలిపారు.

గతంలో ఈ ఉత్సవాలు న్యూఢిల్లీలోనే జరిగేవి. న్యూఢిల్లీ వెలుపల ఈ ఉత్సవాలు జరగడం ఇదే మొదటిసారి. నక్సలైట్లు అకస్మాత్తుగా దాడి చేస్తే సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఏ విధంగా ఎదుర్కొంటారో తెలిపేందుకు ఓ నమూనా ప్రదర్శన జరిగింది. ఒళ్లు గగుర్పొడిచేలా సాగిన ఈ ప్రదర్శనను చూసినవారంతా అవాక్కయ్యారు. కేరళ (Kerala)కు చెందిన ప్రాచీన మార్షల్ ఆర్ట్ కలరిపయట్టు (Kalaripayattu) విన్యాసాలను మహిళలు ప్రదర్శించారు. ఈ విన్యాసాలతో మహిళలు ఆహూతులందిరినీ మంత్రముగ్ధులను చేశారు.

Updated Date - 2023-03-12T18:23:36+05:30 IST