Congress: రేవంత్ వ్యాఖ్యలపై మాణిక్‌రావు ఠాక్రే ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2023-07-12T14:38:10+05:30 IST

సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే మండిపడ్డారు.

Congress: రేవంత్ వ్యాఖ్యలపై మాణిక్‌రావు ఠాక్రే ఏమన్నారంటే...

న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ (CM KCR) సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే (Telangana Congress affairs in-charge Manik Rao Thackeray) మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. కేసీఆర్ పాలన అవినీతి, అక్రమాలతో మునిగిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణలో రైతుల వ్యతిరేకి అని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రైతుల ఉచిత విద్యుత్‌కు వ్యతిరేకం అని ప్రచారం చేస్తోందని అన్నారు. వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ గురించి రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కుర్చీ కింద భూమి కదులుతుంది కాబట్టి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) వాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వింటే ఆయన చెప్పిన ఆలోచన విధానం అర్థం అవుతుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వేగంగా బలం పుంజుకుంటోందన్నారు. కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రయోజనం కలిగింది తప్పా సామాన్య ప్రజలకు ఏమీ జరగలేదని ఆయన అన్నారు.

తెలంగాణలో రైతులకు రుణమాఫీ కేసీఆర్ ఎందుకు చెయ్యలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీని ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, చత్తీస్‌ఘడ్‌లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలు అమలు చేస్తూ రైతులకు ఎక్కువ ప్రయోజనం చేస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ గురించి చేసిన వాఖ్యలు ఏ సందర్భంలో చేసారో అర్ధం చేసుకోవాలని... కొన్ని రాజకీయ పార్టీలు రేవంత్ రెడ్డి వాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయని మాణిక్ రావు ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-07-12T14:38:10+05:30 IST