Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2023-06-10T21:12:24+05:30 IST

యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం యాత్రాజనుల పూజల సందడి నెలకొంది. వారాంతపు సెలవు కావడంతో వివిధ ప్రాంతాల

Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల సందడి

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం యాత్రాజనుల పూజల సందడి నెలకొంది. వారాంతపు సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి ధర్మదర్శనాలకు నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టినట్టు భక్తులు తెలిపారు. సుమారు 40వేల మందికి పైగా భక్తులు (Devotees) ఆర్జిత సేవల్లో పాల్గొని మొక్కు చెల్లించుకున్నట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. ప్రధానాలయ ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన, ప్రాకార మండపంలో వేదాశీర్వచనంతో పాటు పలు ఆర్జిత సేవోత్సవాల్లో భక్తులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కు తీర్చుకున్నారు. కొండకింద నాలుగు దఫాలుగా కొనసాగిన సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో సుమారు 376 జంటలు పాల్గొన్నాయి. యాదగిరీశుడికి నిత్య పూజలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా నిర్వహించారు. సుప్రభాతంతో ఆరంభమైన నిత్య పూజలు రాత్రి వేళ శయనోత్సవ పర్వాలతో ముగిశాయి. ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలను సంప్రదాయరీతిలో నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.54,98,646 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.

Updated Date - 2023-06-10T21:12:24+05:30 IST